జగన్ తీసుకున్న ఓ నిర్ణయం: తంబళ్లపల్లెలో వైసీపీ పదవికి పెరిగిన పోటీ?
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులోని తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలాగా ఉంటోంది. అయితే తాజాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాన్నారా? అనే వాదన వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తొలినాళ్లలో తంబళ్లపల్లెలో అంతగా పట్టు లేకున్నా ఉమాశంకర్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. 1983లో రైతు కూలీ సంఘం నేతగా ఉన్న ఉమాశంకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వయంగా పిలిచి మరీ టికెట్ ఇచ్చారు.
అయితే ఆ ఎన్నికల్లో ఉమాశంకర్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడినా, ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన ఎన్టీఆర్ ఆయనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి మరణించగా, ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ రెండు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఆమె కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయ తెరంగేట్రం చేశారు.
2014 ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి తల్లితో కలిసి వైసీపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రవీణ్ను తిరస్కరించిన అక్కడి ప్రజలు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యువనేత శంకర్ యాదవ్ను గెలిపించుకున్నారు. ఇలా వ్యక్తులు మారినా తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు మాత్రం టీడీపీ వైపే ఉన్నారు.
అయితే ఇటీవలే వైయస్ జగన్ తీసుకున్న ఓ నిర్ణయం పార్టీ కేడర్లో జోరును పెంచింది. 2014 ఎన్నికల ముగిసిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి కనిపించకుండా పోయారు. రెండేళ్ల పాటు ప్రవీణ్ కోసం చూసిన జగన్ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జీగా పార్టీ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డిని నియమించారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా నియోజకవర్గంలో ప్రత్యక్షమైపోయారు. తమను కాకుండా పుంగనూరుకు చెందిన నేతలకు నియోజకవర్గ పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ ఆయన అధిష్ఠాన్ని ప్రశ్నించారు. అంతేకాదు ద్వారకానాథరెడ్డిని తప్పించి ఇన్చార్జీ పగ్గాలు తనకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు 2014 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన మాజీ మంత్రి కలిచర్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఉమాశంకర్ రెడ్డితో ఉన్న విభేదాలను పక్కనబెట్టి మరీ ప్రవీణ్ గెలుపు కోసం యత్నించారు. 'గడపగడపకు వైసీపీ' పేరుతో నియోజకవర్గంలో అడుగుపెడుతున్న ద్వారకానాథరెడ్డిని అడుగడుగునా అడ్డుకోవడంతో తంబళ్లపల్లె నియోజకవర్గ వైసీపీ పదవికి పోటీ పెరిగిందని నేతలు భావిస్తున్నారు.