ఆర్టీసీ బస్సు లగేజీ క్యాబిన్ లో.. బ్యాంగుల నిండా నోట్ల కట్టలు!
శ్రీకాకుళం: ఎన్నికల ప్రచారం సందర్భంగా వందల కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారంటూ ఒకవంక కేంద్ర ఎన్నికల కమిషన్ గగ్గోలు పెడుతుండగా.. మరోవంక- దాన్ని నిజం చేస్తూ కోట్ల రూపాయల మేర నోట్ల కట్టలు రోజూ వెలుగు చూస్తూనే వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు, మద్యం.. ఇతర విలువైన వస్తువులను ఎరగా చూపి, ఓటర్లకు గాలం వేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ.. మూడో స్థానంలో నిలిచిందంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే.. మరోసారి నోట్ల కట్లల వ్యవహారం బయటపడింది. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న బ్యాగులో కోటి రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు పోలీసులు, ఎన్నికల అధికారులు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కుప్పం గడ్డపై జగన్! తన పరిపాలన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు!
బొద్దాం వద్ద తనిఖీ చేస్తుండగా..
జిల్లాలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బొద్దాం వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు దిగువన ఉన్న లగేజీ క్యాబిన్లోని బ్యాగులను క్షుణ్నంగా పరిశీలించగా నోట్ల కట్లలు కనిపించాయి. మూడు లగేజీ బ్యాగుల్లో నోట్ల కట్టలను సర్దారు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు వాటిని లెక్కించగా, సుమారు కోటి 10 లక్షల రూపాయలుగా తేలింది. ఈ బ్యాగు గురించి ఆరా తీయగా.. తమది కాదంటూ ప్రయాణికులు చెప్పారు. పోలీసులు ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేశారు. బ్యాగు ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రయాణికులకు తెలియదట..
ఈ సమాచారం అందుకున్న వెంటనే పాలకొండ డీఎస్పీ ప్రేమ్ కాజల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బ్యాగులను పరిశీలించారు. ప్రయాణికులతో పాటు, డ్రైవర్, కండక్టర్ ను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. బ్యాగులు తమకు చెందినవి కాదంటూ ప్రయాణికులు వెల్లడించారు. అనంతరం డీఎస్పీ రెవెన్యూ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఎన్నికల అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించే యంత్రాలను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి లెక్కబెట్టారు. పట్టుబడిన నగదు కోటి 10 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వంద కోట్ల నగదు స్వాధీనం..
మన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున నగదును పట్టుకుంటున్నారు పోలీసులు. రెండు వారాల వ్యవధిలో సుమారు వంద కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 1,582 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. వేల లీటర్ల మద్యం బాటిళ్లు, బంగారం, గృహోపకరణాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లో దొరికిన నగదు, ఇతర వస్తువుల విలువ 510 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు అధికారులు. 270 కోట్ల రూపాయలతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా.. 518 కోట్ల రూపాయలతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి నాలుగు, అయిదు స్థానాలను పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఆక్రమించాయి. ఇప్పటిదాకా పంజాబ్ లో 155 కోట్ల రూపాయలు దొరకగా.. ఉత్తర్ ప్రదేశ్ లో 142 కోట్ల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.