మీ మద్యం .. నా బాధ్యత.. స్లోగన్ మారినట్లుందా ..? టీడీపీ స్టిక్కర్లతో పట్టుపడ్డ మందు బాటిళ్లు.
అమరావతి: పోలంగ్ సమీపిస్తోంది. ఎన్నికల జాతరకు నాలుగు రోజుల గడువు మాత్రమే మిగలి ఉంది. మంగళవారం నాటికి అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అవుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి.. పోలింగ్ కు 48 గంటల ముందే.. అన్ని పార్టీలు తమ ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బులు, మద్యం పంపిణీ కార్యక్రమాలకు తెర లేపుతారు అభ్యర్థులు. ఆ 48 గంటల సమయాన్ని అత్యంత కీలకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో.. ఎక్కడికక్కడ మద్యం బాటిళ్లను అందుబాటులోకి ఉంచుకుంటున్నారు. భారీ ఎత్తున వాటిని తరలిస్తున్నారు. ఇలా తరలిస్తోన్న మద్యం బాటిళ్లను ఎన్నికల అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలో సుమారు 300 మద్యం బాటిళ్లు, బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో కొన్నింటిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు, నినాదంతో కూడిన స్టిక్కర్లు అంటించి ఉండటం కలకలం రేపుతోంది. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు ఎవరివని పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో ఏసీ మిషన్లు, వాషింగ్ మిషన్లతో ఉన్న ఓ మినీ లారీని కూడా పోలీసులు పట్టుకున్నారు.
పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!
300 మద్యం బాటిళ్లు, బీరు సీసాలు
కృష్ణా జిల్లా రాజధాని అమరావతి పరిధిలోని పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా పోలీసులు, ఎన్నికల అధికారులు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం బాటిళ్లతో నిండివున్న కేస్ లు వెలుగు చూశాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం 300 మద్యం బాటిళ్లు, బీరు సీసాలు ఉన్నట్లు తేలింది. `మీ భవిష్యత్తు నా బాధ్యత` అనే నినాదాన్ని ముద్రించిన స్టిక్కర్లు అంటించి ఉన్నట్లు పోలీసలు చెబుతున్నారు. ఎవరి కోసం వాటిని తరలిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఈ కేసులో ఒక బైక్, ఇద్దరు యువకులను అరెస్టు చేశామని అన్నారు.
సీవిజిల్ ద్వారా ఫిర్యాదు..
మీ భవిష్యత్తు నా బాధ్యత అనే నినాదాన్ని ముద్రించిన స్టిక్కర్లు అంటించి ఉన్న మద్యం బాటిళ్ల వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాటిని ఫొటోలు తీసి సీ విజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురి చేస్తోందనడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదని విమర్శిస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
ఏసీలు, వాషింగ్ మెషీన్లు పట్టివేత
రెండు లారీల్లో తరలిస్తున్న ఏసీలు, వాషింగ్ మిషన్లను పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్ కండీషన్, వాషింగ్ మిషన్లతో పాటు ఓటరు స్లిప్పులు కూడా దొరికినట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విజయవాడలో ఆటోనగర్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆ లారీలను పట్టుకున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వాటికి సంబంధించిన సరైన ఆధారాలు గానీ బిల్లులు గానీ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పటమట పోలీస్ స్టేషన్ కు లారీలను తరలించారు.
ఓటర్లను ప్రలోభానికి గురి చేయడానికి అవసరమైన డబ్బులు, మద్యం, ఇతర గృహోపకరణాల పంపిణీలో మన రాష్ట్రంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. పెద్ద మొత్తంలో డబ్బులు, మద్యం బాటిళ్లు లభ్యమైన రాష్ట్రాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల కిందటే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అగ్రస్థానంలో గుజరాత్, రెండో స్థానంలో తమిళనాడు ఉన్నాయి. మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో పంజాబ్, అయిదో స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ నిలిచాయి.