వైఎస్ జగన్కు డిక్లరేషన్ సెగ: లోటస్పాండ్ నివాసం చుట్టూ: బజరంగ్దళ్ ముట్టడి పిలుపుతో
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ముహూర్తం సమీపిస్తోన్న కొద్దీ రాష్ట్రంలో డిక్లరేషన్ వివాదం పీక్స్కు చేరుకుంటోంది. హైపిచ్లో కొనసాగుతోంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు ఆయన డిక్లరేషన్పై సంతకం చేస్తారా? లేదా? అనే వివాదం చుట్టూ రాజకీయాలు, వివాదాలు ముసుకున్నాయి. కొద్దిరోజులుగా ఈ అంశం చుట్టే పరిభ్రమిస్తున్నాయి రాజకీయాలన్నీ. ఈ సాయంత్రం ఆయన తిరుమలకు బయలుదేరాల్సి ఉండగా.. డిక్లరేషన్ వివాదం మరింత తీవ్రతరమైంది. ఉగ్రరూపాన్ని దాల్చింది.
డీఆర్డీఓ మరో ఘనత: క్షిపణి ప్రయోగాల్లో చారిత్రక ముందడుగు: హైస్పీడ్ ఏరియల్ టార్గెట్
డిక్లరేషన్పైనే ఫోకస్..
అన్యమతస్తులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించాలంటే.. డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. శ్రీవేంకటేశ్వర స్వామివారిపై తనకు అచంచల విశ్వాసం, నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోన్న వైఎస్ జగన్..ముఖ్యమంత్రి హోదాలో తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించాల్సి ఉంది. దీనికోసం ఆయన ఈ సాయంత్రం తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఇదివరకు లేని వివాదం..
ఇదివరకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు కూడా ఈ వివాదం తలెత్తలేదు. ప్రజల అందరి తరఫున వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని, ఇది ఆయన వ్యక్తిగత పర్యటన కాదని, అందుకే డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన అవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఈ వివాదానికి కేంద్రబిందువైంది. అదే సమయంలో- వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేయడంతో డిక్లరేషన్ వివాదం మరింత ముదిరింది.
బజరంగ్దళ్ ముట్టడి పిలుపు..
వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పట్టుబట్టారు. ఇందులో భాగంగా బజరంగ్దళ్ నేతలు, కార్యకర్తలు.. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోటస్పాండ్ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. లోటస్పాండ్ నివాసానికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. బ్యారికేడ్లను అమర్చారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ పోలీసులు.. అక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Recommended Video
రాజకీయ కారణాలే..
ఇదివరకు లేని వివాదాన్ని ఇప్పుడెందుకు లేవదీశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ కారణాలు తప్ప మరొకటి కనిపించట్లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఏనాడూ డిక్లరేషన్ను అమలు చేయలేదని, వైఎస్ జగన్ విషయంలో ఎందుకు వివాదాన్ని సృష్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నందున డిక్లరేషన్ అవసరం లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ హిందువులకు మాత్రమే ప్రాతినిథ్యాన్ని వహించట్లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలకు సూచిస్తున్నారు.