వైసీపీలో రామసుబ్బారెడ్డి చేరిక ఖరారు: రేపే జగన్ సమక్షంలో: అదినారాయణ రెడ్డికి చెక్...!
కడప: కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్. ఇప్పటికే పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ సతీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 13న వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జమ్మలమడుగు టీడీపీ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీలో చేరటం ఖాయమైంది. ఆయన ఇందు కోసం కడప నుండి ముఖ్య అనుచరులతో కలిసి అమరావతి బయల్దేరారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
రామసుబ్బారెడ్డి చేరిక ఖరారు
2019 ఎన్నికల సమయంలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరటానికి కసరత్తు జరిగింది. తన ప్రత్యర్ధి ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుండి తన మీదే గెలిచి టీడీపీలోకి రాగానే మంత్రి పదవి ఇవ్వటాన్ని రామసుబ్బారెడ్డి సహించలేకపోయారు. అయితే, చంద్రబాబు బుజ్జగింపులు..ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో నిర్ణయం మార్చుకున్నారు. అయితే, ఇప్పుడు జిల్లాలో టీడీపీ పరిస్థితులు.. తన రాజకీయ భవిష్యత్ ను పరిగణలోకి తీసుకొని రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. దీని ద్వారా బీజేపీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డికి అధికార పార్టీలో చేరటం ద్వారా రాజకీయంగా చెక్ పెట్టవచ్చని రామసుబ్బారెడ్డి భావిస్తున్నారు. ఇదే సమయంలో దేవగుడి సోదరులు సైతం వైసీపీకి దగ్గరవుతున్నారు. దీంతో..ఇప్పుడు అదినారాయణ రెడ్డి ఏకాకి అవుతున్నారు.
రామసుబ్బారెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్
జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. బుధవారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే ఆయన వైసీపీలో చేరుతున్నారు. జిల్లాకే చెందిన పులివెందుల సతీష్ రెడ్డి..అదే విధంగా జిల్లాలో సీనియర్ నేత పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. రామసుబ్బారెడ్డి చిన్నాన్నశివారెడ్డి హత్య తరువాత క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చిన రామ సుబ్బారెడ్డి రెండు సార్లు టీడీపీ నుండి గెలిచారు.
చంద్రబాబు హయాంలో మంత్రిగానూ పని చేశారు. అయితే, మూడు సార్లు ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక, 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన ఆదినారాయణ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరటంతో మంత్రి పదవి దక్కింది. దీనిని తొలి నుండి ప్రత్యర్ధి వర్గంగా ఉన్న రామసుబ్బారెడ్డి వర్గం జీర్ణించుకోలేక పోయింది. అప్పుడే పార్టీ మార్పు గురించి ఆలోచన చేసినా చంద్రబాబు బుజ్జగింపులతో ఆగిపోయింది. ఇక, 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో కుదిరిన ఒప్పందం మేరకు కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి..జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బా రెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. ఆ తరువాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. అప్పటి నుండి స్థబ్దుగా ఉన్న రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు.
ఆదినారాయణ రెడ్డికి చెక్...
కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాత శత్రుత్వాలను సైతం పక్కన పెట్టి..వైసీపీ తమ ప్రత్యర్ధులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా పులివెందుల సతీష్ రెడ్డి ఇప్పటికే టీడీపీకి రాజీ నామా చేసారు. ఈ నెల 13న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఇక, ఇప్పుడు జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా..రామ సుబ్బారెడ్డిని పార్టీలోకి తీసుకోవ టం ద్వారా తనకు ఎటువంటి ఇబ్బంది రాదని..టీడీపీని దెబ్బ తీయాలంటే ఆయన రాకను అడ్డుకోవద్దంటూ వైసీపీ పెద్దలు సుధీర్ రెడ్డిని బుజ్జగించారు. అయితే, ఇప్పటికిప్పుడు రామసుబ్బారెడ్డికి పదవులు సైతం దక్కే అవకాశం లేదు.
కడప జిల్లాలో ఖాళీ అవుతున్న టీడీపీ
ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనాధ రెడ్డి మూడు రాజధానుల బిల్లుల విషయంలో వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన పెద్ద సోదరుడు సైతం వైసీపీ వైపే ఉన్నారు. కడప జిల్లాలో టీడీపీ ముఖ్య నేతలు వైసీపీ బాట పడుతుండటంతో..ఇప్పుడు టీడీపీకి జిల్లాలో పునాదులు కదులుతున్నాయి. వైయస్ కుటుంబానికి తొలి నుండి అండగా నిలుస్తున్న పులివెందుల... జమ్మలమడుగులో ఇప్పుడు టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీని ద్వారా..జిల్లాలో పూర్తిగా టీడీపీని నిర్వీర్యం చేయాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తున్నా..పోరాటం సాగుతుందని స్థానిక టీడీపీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.