రణరంగంగా కొవ్వూరు: పోలీసులపై రాళ్లదాడి.. లాఠీఛార్జీ: వాహనాలు ధ్వంసం: ఉలిక్కిపడ్డ ప. గోదావరి..!
కాకినాడ: లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వరాష్ట్రాలకు తరలి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ.. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం రణరంగంగా మారింది. హైదరాబాద్ తరహా ఉదంతం ఇక్కడ పునరావృతమైంది. హైదరాబాద్ సమీపంలోని కంది ఐఐటీ భవన సముదాయంలో ప్రాంగణంలో వందలాది మంది వలస కార్మికుల తరహా సంఘటన సోమవారం ఉదయం కొవ్వూరులో చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఘటనతో ఉలిక్కి పడింది.
మద్యం దొంగలు వైసీపీ నేతలే: కరోనా సంక్షోభాన్ని అవకాశంగా: లిక్కర్ రేట్ల పెంపుపై భగ్గుమన్న టీడీపీ
వందలాది మంది వసల కార్మికులు బైఠాయింపు..
తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది వలస కార్మికులు రోడ్డెక్కారు. రహదారిపై అడ్డుగా బైఠాయించారు. నినాదాలతో పరిసర ప్రాంతాలను హోరెత్తించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ.. తమను ఎందుకు స్వస్థలాలకు పంపించట్లేదని, వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని వారు నినదించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది. ఫలితంగా కొవ్వూరు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంక్షలను అధిగమించి..
పశ్చిమ గోదావరి జిల్లాలో గల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చేపలవృత్తిని కొనసాగిస్తూ జీవిస్తోన్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఈ ఉదయం పెద్ద ఎత్తున గుమికూడారు. సుమారు 300 నుంచి 400 మంది కార్మికులు కొవ్వూరు పట్టణంలో రోడ్ల మీదికి చేరుకున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా రోడ్ల మీదికి రావడం కలకలం రేపింది. గోదావరి మాత విగ్రహం వద్ద బైఠాయించారు. లాక్డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటుకుని రాజమహేంద్రవరం వైపు కదలివెళ్లడానికి ప్రయత్నించారు.
నచ్చజెప్పడానికి ప్రయత్నించినా..
సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు వారిని నిలువరించారు. జిల్లాలోని వలస కార్మికులను తరలించడానికి అనుమతి ఇస్తూ తమకు ఎలాంటి సమాచారం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించిన వెంటనే స్వస్థలాలకు తరలిస్తామని అన్నారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. నెలరోజులుగా తాము సరైన తిండి, నిద్ర లేకుండా గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ ముగుస్తుందని, రైళ్లు అందుబాటులోకి వస్తాయని తాము ఆశించిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.
Recommended Video
రాళ్లు రువ్విన వసల కార్మికులు.. లాఠీ ఛార్జీ చేసిన పోలీసులు..
ఈ సందర్భంగా పోలీసులు, వలస కార్మికుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీనితో పోలీసుల సహనం నశించింది. వారిపై లాఠీఛార్జీకి దిగారు. చెదరగొట్టడానికి ప్రయత్నించారు. దీనితో ఆగ్రహించిన వలస కార్మికులు కూడా పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. రాళ్లు రువ్వారు. రాళ్లు తగిలి ఒకట్రెండు పోలీసు వాహనాల అద్దాలు పగిలాయి.సంఘటనా స్థలం అంతా తెగిన చెప్పులు, రాళ్లతో భీతావహంగా కనిపించింది. రాళ్లు తగలకుండా పోలీసులు వాహనాలను వెనక్కి తీసుకెళ్లారు. తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు.