ఏపీలో దారుణం: మద్యం మత్తులో భార్యను కొట్టి సజీవంగా పాతిపెట్టి పారిపోయిన భర్త
తాగిన మైకంలో కట్టుకున్న భార్యను కొట్టి ఆమె బ్రతికి ఉండగానే గొయ్యి తీసి పాతిపెట్టాడు ఓ ఘనుడు. అంతేకాదు ఏడేళ్ల చిన్నారిని వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి పారిపోయాడు. అమ్మకు ఏమైందో తెలియని చిన్నారి, నాన్న ఎటు వెళ్ళాడో అర్థం చేసుకోలేని ఆ పసి మనసు రెండు రోజులపాటు మౌనంగా రోదించింది.చివరకు అమ్మను నాన్న కొట్టాడని, పాతి పెట్టాడని, ఎటో వెళ్ళిపోయాడని గ్రామస్థులకు చెప్పి బోరున విలపించింది. హృదయవిదారకంగా అనిపించిన ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగింది.
నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం గొట్లపాలెం లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే గ్రామంలో నివాసం ఉంటున్న పొన్నూరు సుభాషిని, ఆమె భర్త సాములు కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తూ ఉండేవారు. వారికి ఏడేళ్ల పాప ఉంది. ఇటీవల భార్య, భర్త ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. తర్వాత వారు ఇరువురు గొడవ పడ్డారు. మద్యం తాగిన మత్తులో భార్యతో గొడవపడిన సాములు ఆమెను కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో సుభాషిని స్పృహ కోల్పోయింది.
స్పృహ కోల్పోయిన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్ళకుండా ఇంటి పక్కనే ఉన్న చెట్లపొదల్లో గుంత తీసి పాతిపెట్టాడు భర్త. ఇక ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని 7 ఏళ్ల కూతురుని బెదిరించి మరీ పారిపోయాడు. రెండు రోజులపాటు ఇంట్లోనే ఉండి ఏడుస్తూ కూర్చున్న ఆ పాప తరువాత బంధువులకు గ్రామస్తులకు విషయం చెప్పింది. తండ్రి చేసిన దారుణాన్ని తాను అర్ధం చేసుకున్నంతవరకూ చెప్పింది ఆ పాప. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సాములు కోసం గాలిస్తున్నారు.