టెక్కీ దాష్టీకం: ఆడపిల్ల పుట్టిందని భార్యకు విద్యుత్ షాకిచ్చిన భర్త
విజయవాడ:ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకొంది.ప్రాణాపాయం నుండి బయటపడిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు సంవత్సరాల క్రితం పెనమలూరు పెద్ద గుడి ప్రాంతానికి చెందిన ఓ యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. ఇద్దరిది వేర్వేరు కులాలు.
గతంలో అతడికి వివాహమైంది,. భార్యకు విడాకులిచ్చి ఈ యువతిని వివాహం చేసుకొన్నాడు. ఆ యువకుడు ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి తొలి సంతానంగా కొడుకు పుట్టాడు.
భార్యను అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది పెద్ద మనుషులు రాజీ చేయడంతో ఆమె కేసును ఉపసంహరించుకొంది.
ఇటీవలనే వీరికి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని అతడు భార్యపై కోపంగా ఉన్నాడు. పసిపాపతో నిద్రపోతున్న భార్యకు కరెంట్ షాకిచ్చాడు నిందితుడు.భయంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.