దంపతుల మధ్య స్నేహితుడు, పెళ్లి చేసుకోమన్న భర్త, ఆ వీడియో ఉందని బ్లాక్మెయిల్
విజయవాడ: చేసిన అప్పు తీర్చలేక.. అందుకోసం భార్యనే పణంగా పెట్టాలనుకున్నాడో భర్త. పైగా అందులో తప్పేమి లేదని.. నువ్వు నా స్నేహితుడితో ఉంటే మనకే మంచిదని నిత్యం ఆమెను మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. భర్త మాటలకు ఆమె ససేమిరా అంటుండటంతో.. ఇటీవల ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి చేరి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
రియాజ్-సుల్తానా..:
విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట జెండా చెట్టు ప్రాంతానికి చెందిన ఎండీ. మల్లికా సుల్తానా (27), భవానీపురానికి చెందిన రియాజ్లకు గతేడాది జూన్ 19వ తేదీన వివాహం జరిగింది. వీరిద్దరికి ఇది రెండో వివాహం. సుల్తానాకు గతంలోనే వివాహమై విడాకులు తీసుకోగా.. రియాజ్ కూడా మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. వివాహ సమయంలో సుల్తానా కుటుంబం రియాజ్కు కట్నంతో పాటు బంగారు, వెండి వస్తువులు, ఇంతర లాంఛనాలు జరిపించారు.
తరుచుగా ఇంటికొచ్చేవాడు..:
వృత్తిరీత్యా రియాజ్ పాత టైర్ల వ్యాపారం చేస్తుంటాడు. కడప జిల్లాకు చెందిన అతని స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ రహమాన్ భార్య బషీరాను తీసుకుని తరుచుగా వీరి ఇంటికి వచ్చేవాడు. రియాజ్ కొన్ని సందర్భాల్లో ఆర్థిక సహాయం కూడా చేయడంతో.. ఈ రెండు కుటుంబాలకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి.
ఆ వీడియో ఉందని.. బ్లాక్మెయిల్:
రియాజ్ తో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని రహమాన్.. అతని భార్య సుల్తానాపై కన్నేశాడు. 'నువ్వు అంటే నాకు ఇష్టం.. నీ భర్తకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో' అంటూ వేధించడం మొదలుపెట్టాడు. 'నువ్వు స్నానం చేస్తున్న వీడియో నా వద్ద ఉంది. నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే దాన్ని లీక్ చేస్తా' అంటూ బ్లాక్ మెయిలింగ్ కి కూడా దిగాడు. అదే క్రమంలో ఆమె నుంచి 18కాసుల నగలు కూడా లాక్కెళ్లిపోయాడు.
భర్త కూడా అదే మాట..:
రహమాన్ వేధింపులపై భర్త రియాజ్ తో చెప్పినా.. అతని నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడం సుల్తానాను మరింత బాధపెట్టింది. పైగా 'నువ్వు నా స్నేహితున్ని పెళ్లి చేసుకో.. నాకేమి అభ్యంతరం లేదు. అతను మనకు కొంత అప్పు కూడా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కాదంటే డబ్బుల కోసం వేధిస్తాడు.' అంటూ భర్త కూడా అతనికే వత్తాసు పలికాడు. లేనిపక్షంలో పుట్టింటి నుంచి రూ.5లక్షలు తీసుకురావాలని బెదిరించాడు.
కేసు పెట్టిన సుల్తానా:
ఓరోజు రహమాన్ భార్య బషీరా సైతం ఫోన్ చేసి.. 'నా భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకో.. నాకు అభ్యంతరం లేదు' అంటూ చెప్పడంతో సుల్తానా కన్నీరుమున్నీరైంది. రోజురోజుకు భర్త నుంచి ఒత్తిడి కూడా పెరిగింది. ఇదే క్రమంలో ఓరోజు ఆమెను తీవ్రంగా కొట్టగా.. ఇక తాళలేక ఆమె పుట్టింటికి చేరింది. రియాజ్తో పాటు అన్న జాఫర్ హుస్సేన్, చెల్లెలు అఫ్రోజ్, మేనల్లుడు సయ్యద్ షాదిక్, రహమాన్ భార్య బషీరా తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ భవానీపుర పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది.