పరాయి స్త్రీలతో ఆ పని వద్దన్నందకు..! కట్టకున్న భార్యనే..
మంత్రాలయం : వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దని వారించినందుకు భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. పెళ్లయిన ఏడాదికే భర్త చెడు తిరుగుళ్లను చూసి నివ్వెరపోయిన భార్య.. అతడిని గాడిన పెట్టాలని ప్రయత్నం చేయగా.. తప్పు దిద్దుకోలేదు సరికదా అడ్డుగా ఉందని భార్యనే హత్య చేసేశాడు.
వివరాల్లోకి వెళితే.. పెద్దకడబూరు మండలం బాపురం గ్రామానికి చెందిన భవాని అలియాస్ లలిత (20) కి కోసగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన శివారెడ్డి, రత్నమ్మల కుమారుడు పురుషోత్తం రెడ్డి గతేడాది మే 15న వివాహం జరిగింది. డ్రైవర్ గా పనిచేసే పురుషోత్తం రెడ్డికి పెళ్లయ్యే నాటికే పలువురితో వివాహేతర సంబంధం ఉండడంతో.. విషయం తెలుసుకున్న భార్య అతనిలో మార్పు కోసం ప్రయత్నించింది.
అయితే ఎన్నిసార్లు చెప్పి చూసినా.. తీరు మారకపోవడంతో మూడు రోజుల క్రితం పురుషోత్తం రెడ్డితో గొడవ పడింది లలిత. గొడవను మనసులో పెట్టుకున్న పురుషోత్తం రెడ్డి కక్ష సాధించాలని చూశాడు. ఇందుకోసం గుడికి తీసుకెళుతానని మాయ మాటలు చెప్పి మార్గ మధ్యలో ఆమెను హత్య చేసి ఏమి ఎరుగనట్లు ఇంటికి చేరుకున్నాడు. చివరికి విషయం పోలీసుల చెవిన పడడంతో అసలు నిజం కక్కించారు పోలీసులు.
ఎలా హత్య చేశాడు?
మంగళవారం నాడు అమావాస్య కావడంతో భార్య లలితతో గుడికి వెళుదామని చెప్పాడు పురుషోత్తం రెడ్డి. అనుకున్నట్లుగానే ఇద్దరు కలిసి జంపాపురం నుంచి సమీపంలోని ఉరకుంద ఈరన్న స్వామి దర్శనం కోసం బయలుదేరారు. అయితే ఈరన్న స్వామి దర్శనానికి కాకుండా.. గాణదాలలో ఉన్న పంచముఖి ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లాడు.
అక్కడి నుంచి తుంగభద్ర నదీ తీరంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిని చూపించి.. అందులో తన స్నేహితుడు ఉంటాడని, తీసుకున్న అప్పు చెల్లించట్లేదని, నువ్వే గట్టిగా నిలదీయాలని భార్యను నమ్మించి తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆమెపై హత్యాయత్నం చేశాడు. ముందుగా గొంతు నులుమడంతో లలిత స్పృహ కోల్పోయింది.
అనంతరం వెంట తెచ్చిన ఓ బ్లేడుతో ఆమె విచక్షణా రహితంగా ఆమె గొంతు కోసేశాడు పురుషోత్తం రెడ్డి. ఇంటికెళ్లి భార్య తప్పిపోయిందని చెప్పడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు పురుషోత్తం రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.