భార్య పొట్టిగా ఉందని... ఊహించని దారుణానికి తెగబడ్డ భర్త...
కర్నూలులో దారుణం జరిగింది. భార్య పొట్టిగా ఉందని ఆమెపై విరక్తి పెంచుకున్న భర్త.... ఆమె సోదరిపై మనసు పడ్డాడు. మరదలిని పెళ్లి చేసుకోవాలంటే భార్యను హతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలివిగా భార్యతోనే ఓ సూసైడ్ నోట్ కూడా రాయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం భార్యను హత్య చేసి... ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులకు ఇచ్చాడు. కానీ ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
పొట్టిగా ఉందన్న అసంతృప్తి...
పోలీసుల కథనం ప్రకారం... కర్నూల్ జిల్లాలోని ఆలేబాదు తండాకు చెందిన రవి నాయక్కు బేతంచర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలా భాయితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భార్య పొట్టిగా ఉండటంతో మొదటి నుంచి రవి నాయక్ ఆమె పట్ల అసంతృప్తితో ఉండేవాడు. ఇదే క్రమంలో సుశీలా భాయి సోదరిపై మనసు పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య అతన్ని నిలదీయడంతో... తరుచూ ఇద్దరికీ గొడవలు జరిగేవి.
సూసైడ్ నోట్ రాయించి మరీ..
ఎలాగైనా సుశీలా భాయి సోదరిని వివాహం చేసుకోవాలని రవి నాయక్ భావించాడు. ఇందుకోసం సుశీలా భాయిని మట్టుబెట్టాలనుకున్నాడు. రేఖా నాయక్ అనే బంధువు ద్వారా సుశీల హత్యకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా రేఖా నాయక్ను పురిగొల్పి భార్యతోనే ఓ సూసైడ్ నోట్ రాయించాడు. 'జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను.' అని అందులో సుశీల పేర్కొంది. ఆ లేఖ రాసిన కొద్దిరోజులకు.. ఈ నెల 14న పశువులను మేపేందుకు సుశీలను కూడా రవి నాయక్ వెంట తీసుకెళ్లాడు.
పథకం ప్రకారం హత్య...
అప్పటికే రేఖా నాయక్తో కలిసి అంతా ప్లాన్ చేసిన రవి నాయక్... ఓ నిర్మానుష్య ప్రదేశంలో సుశీలా భాయి తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం సమీపంలోని లోయలోకి మృతదేహాన్ని తోసేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఇంటికి వచ్చి తన భార్య కనిపించట్లేదని... ఇంట్లో సూసైడ్ నోట్ దొరికిందని నాటకం ఆడాడు. అయితే సుశీల తల్లిదండ్రులకు అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video
రిమాండ్కు తరలింపు...
పోలీసులు రవి నాయక్ను అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు నిజం ఒప్పుకున్నాడు. తానే ఆమెను హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు. దీంతో రవి నాయక్తో పాటు రేఖా నాయక్పై కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ రిమాండ్కు తరలించారు. పోలీసుల దర్యాప్తుల్లో ఆలేబాదు తండా సమీపంలోని కొండల్లో సుశీల మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.