భార్య వేరొకరి బైక్పై వస్తుండటం చూసి...లారీతో గుద్ది చంపిన భర్త
విజయనగరం:అతడో లారీ డ్రైవర్...అతడికి భార్యపై అనుమానం...తాను లేనప్పుడు ఆమె వేరే ఎవరితోనో తిరుగుతుందని అతడి డౌట్..ఈ క్రమంలో లారీ నడుపుతూ వెళుతున్న అతడికి భార్య బుంధువుతో బైక్ పై వెళుతుండటం చూసి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
దీంతో ఆ బైక్ ను వెంటాడి లారీతో గుద్దేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే చనిపోగా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విజయనగరం జిల్లాలో చోటెచేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు లారీతో సహా పరారీలో ఉన్న నిందితుడిని వెంటాడి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...
విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన తవిటయ్య అనే వ్యక్తికి రమణమ్మతో 20 ఏళ్ల కిందట వివాహమైంది. తవిటయ్య లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవల భార్య రమణమ్మ ప్రవర్తన పై అనుమానం వచ్చింది. ఆమె తాను లేనప్పుడు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని తిరుగుతుందనే భావన అతనిలో ఉంది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తవిటయ్య లారీలో వస్తూ భార్యకు ఫోన్ చేశాడు. నువ్వు సుభద్రాపురం జంక్షన్కు వస్తే ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చి వెళ్తానని ఆమెతో చెప్పాడు. ఈ క్రమంలో ఆమె తనకు మరిది వరసైన ఒక బంధువు బైక్ పై ముందుగా వెళుతూ కనిపించింది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహానికి లోనై ఒక్కసారిగా వారి బైక్ ను వెంటాడి ఢీ కొట్టాడు.
దీంతో వెనక కూర్చున్న రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న బంధువుల వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో లారీతో పరారవుతున్న తవిటయ్యను ఛేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.