భార్య హత్య: టెక్కీ గర్ల్తో సంబంధం బయటపెట్టినందుకే
హైదరాబాద్: మూడు రోజుల క్రితం హైదరాబాదులోని చిక్కడపల్లిలో జరిగిన టెక్కీ భార్య రజని హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు... భర్త వివాహేతర సంబంధం బయటపెట్టినందుకే హత్య చేసినట్లుగా విచారణలో గుర్తించారు. ఈ కేసులో భర్తే ప్రధాన నిందితుడు కాగా తల్లిదండ్రులు అతనికి సహకరించారు. మామ హత్య చేయగా భర్త సహకరించినట్లుగా మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
సోమవారం పోలీసులు కేసు వివరాలు తెలిపారు. చిక్కడపల్లిలో నివాసం ఉండే చిత్తరంజన్ కుమారుడు బాలకృష్ణకు మేడ్చల్కు చెందిన రజనితో పదేళ్ల క్రితం పెళ్లయింది. బాలకృష్ణ సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అతనికి తన కంపెనీలో పని చేస్తున్న ఓ యువతితో పరిచయమైంది. అది ివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది తెలిసిన భార్య రజని అత్తమామలకు, కుటుంబ సభ్యులకు తెలిపింది.
తన విషయాన్ని బయటపెట్టినందుకు భర్త బాలకృష్ణ భార్య పైన కక్ష పెంచుకున్నారు. అదే సమయంలో మామ రజనిని లైంగికంగా వేధించాడు. దీనిని కూడా రజని బయటపెట్టింది. దీంతో భర్త ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. హత్యకు ప్లాన్ చేశాడు. ఈ నెల 27వ తేదిన ఇంటికి వస్తున్న సమయంలో కత్తి, క్షుద్ర పూజలు చేస్తొందంటూ నమ్మించేందుకు అందుకు సంబంధించిన వస్తులువు తెచ్చాడు.
రాత్రి రజనికి నిద్రమాత్రలు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత తెల్లవారుజాము ఆమెను కత్తితో పొడిచి చంపాడు. బాలకృష్ణ తల్లిదండ్రులు, చెల్లెలు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత క్షుద్రపూజలు చేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు పూజా సామాగ్రిని బాల్కనీలో వేశారు. పోలీసులు భర్త, అత్త, మామ, ఆడపడుచులను అదుపులోకి తీసుకొని విచారించారు. బాలకృష్ణ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, అంతకుముందు ఓసారి రజనికి విషం ఇచ్చే ప్రయత్నాలు చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.