భూ అక్రమాల ఎఫెక్ట్: దీపక్ రెడ్డి సస్పెన్షన్, చంద్రబాబు సీరియస్
హైదరాబాద్లో భూ అక్రమాల కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
హైదరాబాద్/విజయవాడ: హైదరాబాద్లో భూ అక్రమాల కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నందునే దీపక్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ తెలిపారు.
గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దీపక్ రెడ్డి వ్యవహారంపై సుమారు గంటపాటు చర్చించిన సీఎం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
ఇటీవల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిపై అవినీతి ఆరోపణలో వచ్చిన వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం దీపక్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, దీపక్ రెడ్డి.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మేనల్లుడే కావడం గమనార్హం.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలో పెట్టుకునే ప్రసక్తే లేదని సీఎం ఖరాకండిగా మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీకి చెడ్డపేరు తెస్తే ఎంతటివారైనా సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు.
విశాఖపట్నం రాజకీయ నేతల విభేదాలపైనా చంద్రబాబు చర్చించారని చెప్పారు. గురువారం చంద్రబాబుతో పలువురు పార్టీ కీలక నేతలు సమావేశమై పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సమీక్షించారు. విశాఖపట్నం భూముల వ్యవహారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి అయ్యన్నపాత్రుడు ఏర్పడిన వివాదంపైనా ఈ సందర్భంగా చర్చించారు.
పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురాకుండా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్ని సార్లు చెప్పినా పార్టీ నేతల వ్యవహారం మారకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు టీడీపీ నేతలు తెలిపారు.