ఇఫ్లూ రేప్: ఫిర్యాదు చేస్తుందనుకోలేదన్న నిందితులు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఇఫ్లూలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం ఉదయం కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఆ తర్వాత వారిని జుడీషియల్ రిమాండ్కు తరలించారు. కాగా, తాము విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డామని నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
అయితే బాధితురాలు తమ స్నేహితురాలు కావడంతో రేప్ తర్వాత తాము పరిస్థితిని సద్దుమణిగేలా చూడగలమని అనుకున్నామని నిందితులు చెప్పారు. ‘నిందితులు నితిన్ సోలసముద్రం, కె రాజ్ సింహా(24)లను పోలీసులు కోర్టు ఎదుట హాజరపర్చాం. తర్వాత వారిని 14రోజులపాటు జుడిషియల్ రిమాండ్కు తరలించాం' అని ఓయు పోలీస్ ఇన్స్పెక్టర్ వి అశోక్ రెడ్డి తెలిపారు.
తమ విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారని, బాధితురాలు తమపై ఫిర్యాదు చేస్తుందనుకోలేదని నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ‘రేప్ తర్వాత ఫిర్యాదు చేయకుండా ఆమెను నియంత్రించగలమని అనుకున్నాం. తన మరో స్నేహితుడ్ని కలిసేందుకు బాధిత యువతి పురుషుల హాస్టల్కు వచ్చింది. తిరిగి వెళ్తుండగా ఆమెను సిగరేట్ తాగేందుకు నితిన్ గదికి రావాలని కోరాం. అందుకు అంగీకరించిన ఆమె గదికి వచ్చింది. కొంత మత్తులోకి వెళ్లిన ఆమెపై ఇద్దరం అత్యాచారానికి పాల్పడ్డాం' అని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఇఫ్లూ టీచర్స్ అసోసియేషన్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధికారులను డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఓ కమిటీ వేయాలని అన్నారు. వర్సిటీ వీసిని కలిసిన అసోసియేషన్ సభ్యులు ఈ ఘటనపై చర్చించారు. బాధితురాలికి సానుభూతి వ్యక్తం చేశారు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్సిటీ విద్యార్థులు పెధ్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వైస్ ఛాన్సలర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ వారితో మాట్లాడేందుకు నిరాకరించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఘటనపై వర్సిటీ అధికారులు తమతో ఎందుకు మాట్లాడటం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. వర్సిటీలో ఏ ఘటన జరిగినా విద్యార్థులను సంప్రదించకుండా చర్యలు తీసుకుంటోందని, ఇదే పెద్ద సమస్య అని పిహెచ్డి స్కాలర్ రోజ్ సెబస్టియన్ తెలిపారు.
విద్యార్థుల హాస్టల్స్లోకి విద్యార్థినులకు అనుమతి లేదు
ఇక నుంచి విద్యార్థునులకు పురుషుల హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఇఫ్లూ అధికారులు మంగళవారం వెల్లడించారు. బయటివారిని క్యాంపస్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని చెప్పారు. విద్యార్థుల భద్రత కోసమే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. వర్సిటీలో అంతర్గత ఫిర్యాదు విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.