ప్రజారాజ్యం పార్టీ అధినేతగా 2009 నాటి కేసులు: చిరంజీవికి ఊరట
కర్నూలు: ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి ఆరేళ్ల కిందటి కేసులలో ఊరట లభించింది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడి హోదాలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన రోడ్డు షోవల్ల సాధారణ ప్రజానీకానికి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో చిరంజీవిపై కేసు నమోదైంది.
ఇందుకు సంబంధించి 2009లో ఆయన పైన రెండు కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో విచారణలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయి మంగళవారం తీర్పును వెల్లడించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో 2009 ఫిబ్రవరి 19న తాను నిర్వహించిన రోడ్డు షోకు సంబంధించి తన పైన నమోదైన కేసులో నంద్యాల కోర్టులో విచారణను కొట్టివేయాలని చిరంజీవి ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు.
మరో కేసుకు సంబంధించి కోయిలకుంట్ల జూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణను కూడా కొట్టేయాలని చిరంజీవి హైకోర్టును కోరారు.
స్వతంత్ర వ్యక్తి కాకుండా, పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేయడం సరికాదని, ఇది నిబంధనలకు విరుద్ధమని, గతంలో ఈ అంశంపై హైకోర్టు పలు తీర్పులను వెల్లడించందని చిరంజీవి తరఫు న్యాయవాది చెప్పారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న జడ్జి కేసుల్లో విచారణలను కొట్టివేశారు.