ప్రధాని మోడీకి చంద్రబాబు ఆసక్తికర లేఖ, జీవనోపాధికి రాజకీయాలా..?
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు. నల్లధనాన్ని కట్టడి చేయాలంటే ఈ నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెద్ద నోట్లను రద్దు చేసి, నగదు రహిత కొనుగోళ్లను ప్రోత్సహించాలని ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు సూచించారు. అప్పుడే డిజిటల్ ఇండియా రూపుదిద్దుకుంటుందన్నారు. నల్లధనంపై ప్రధానికి లేఖ రాసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే మొదటివారు.
కాగా, చంద్రబాబు దసరా రోజున వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు ఏ స్వార్థం లేదని, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. జీవనోపాధికి రాజకీయాలపై ఆధారపడకూడదన్నారు.
25 ఏళ్ల క్రితం హెరిటేజ్ కంపెనీ ప్రారంభించానని చెప్పారు. తొలుత గంట, రెండు గంటలు సమయం వెచ్చించేవాడినని, తర్వాత కుటుంబ సభ్యులు చూసుకున్నారన్నారు. ఎవరూ వేలెత్తి చూపని విధంగా నడిపిస్తున్నారని చెప్పారు.
నీతి, నిజాయతీగా ఉండి కూడా జీవనోపాధి సంపాదించుకోవచ్చనడానికి ఇదంతా చెబుతున్నానని, ఎన్నికల్లో ఖర్చు తగ్గిద్దామని తమ వాళ్లకు చెప్పానని, ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చిన వారికి ఓట్లు వేస్తున్నారని, అది సరికాదన్నారు. అవినీతి నిర్మూలనకు రాబోయే రోజుల్లో పూర్తిగా ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగాలన్నారు.