హైద్రాబాద్పై సర్వహక్కులు, డిగ్గీ చెప్పినా తగ్గం: అనంత
న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన తమకు సర్వ హక్కులున్నాయని అనంతపురం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామి రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. సమైక్య ఉద్యమం కారణంగా సీమాంధ్రలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు రెచ్చగొట్టేలా దూషిస్తున్నరని మండిపడ్డారు.
హైదరాబాదు పైన తమకు హక్కు లేదనటం సరికాదన్నారు. విభజన జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాల్సిందే అన్నారు. విభజన సమస్యకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు.
సమైక్యాంధ్ర కోసం అవసరమైతే తాము రాజీనామాలు ఆమోదించుకుంటామన్నారు. రాజీనామాలపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ఉద్యమ తీవ్రతను గమనించి అధిష్టానం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. అధిష్టానం చెప్పినా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పినా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు.
తాము అన్యాయానికి గురవుతున్నాం కాబట్టే సమైక్యాంధ్ర అడుగుతున్నట్లు చెప్పారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తమను ఉద్యమంలోకి రావొద్దని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీని వీడుతారా అని ప్రశ్నిస్తే... తాము విభజన విషయంలో అధిష్టానాన్ని ఒప్పిస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. విభజన నిర్ణయం తొందరపాటు అని అందరం చెబుతున్నామన్నారు.