మాకు సంబంధం లేదు, తెలంగాణదే: అరెస్ట్లపై బాబు, జగన్పై ఆగ్రహం
హైదరాబాదులో శాంతిభద్రత సమస్య తమ ప్రభుత్వానిది కాదని, తెలంగాణ ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శాసన సభలో అన్నారు. చలో హైదరాబాద్ పేరిట అంగన్వాడీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. దీని పైన ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. హైదరాబాదులో అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకున్నది ఏపీ ప్రభుత్వం పోలీసులు కాదని చెప్పారు. హైదరాబాదు శాంతిభద్రతలు తెలంగాణ రాష్ట్రం చేతుల్లో ఉన్నాయని చెప్పారు.
అంగన్వాడీలు ఆందోళన విరమించాలని చెప్పారు. వారిని అరెస్టులు తమ ప్రభుత్వం నిర్ణయం కాదని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు చోటివ్వకుండా అంగన్వాడీలు తక్షణమే ఆందోళన విరమించాలన్నారు.
కాగా, అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు మండిపడ్డ విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత అగ్లీసీన్ సృష్టిస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. అవినీతి పత్రిక ఉందని అడ్డగోలుగా వార్తలు రాయవద్దన్నారు. సాక్షి పత్రిక పోలవరం ప్రాజెక్టు పైన రాసిన కథనం పైన అధికార పార్టీ నిప్పులు చెరిగింది.
సభలో గందరగోళం చెలరేగటంతో సభ వాయిదా పడింది. అనంతరం ఒకటిన్నరకు తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాయలసీమ కల్చర్ శాసన సభలో ప్రవేశ పెట్టాలనుకోవడం విడ్డూరమని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు ముప్పయ్యేళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేదన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో సభ తిరిగి రేపటికి వాయిదా పడింది.