పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయం
Recommended Video
విశాఖపట్నం : ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే అదనుగా కొన్ని ముఠాలు కిడ్నీల వ్యాపారం చేస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయిన పెద్దోళ్ల దగ్గర లక్షలకొద్దీ బేరమాడుకుని పేదోళ్ల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా విశాఖపట్నంలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ భాగోతంలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. బాధితుడి కిడ్నీ తీసుకుని ముప్పుతిప్పలు పెట్టిన వైనం పోలీస్ ఠాణాకు చేరింది. దళారుల చేతిలో నిలువునా మోసపోయిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టురట్టైంది.
జగ్గారెడ్డి కారెక్కేస్తారా?.. గాంధీభవన్ లో ఉంటారా?.. మే 25 తర్వాత ఆ ట్విస్టేంటో..!
విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన పార్థసారధి జీవన పోరాటంలో భాగంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అయితే కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఒక కిడ్నీ అమ్మాలనుకుని డిసైడయ్యారు. ఆ మేరకు బెంగళూరుకు చెందిన కిడ్నీ బ్రోకర్ మంజునాథ్ ను సంప్రదించారు. అయితే ఒక కిడ్నీ ఇస్తే 12 లక్షల రూపాయలు ఇస్తానంటూ బేరం కుదుర్చుకున్నాడు. అయితే అంత పెద్ద మొత్తం ఆఫర్ ఇచ్చేసరికి పార్థసారధి ఓకే చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా.. మంజునాథ్ అసలు రూపం తర్వాత బయటపడింది.
పార్థసారధి నుంచి కిడ్నీ తీసుకుని బెంగళూరుకు చెందిన ఓ పేషెంటుకు అమర్చారు. విశాఖపట్నంలోని శ్రద్ధ ఆస్పత్రి డాక్టర్లు పత్రాలు ఫోర్జరీ చేసి కిడ్నీ ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే ఒక కిడ్నీ ఇస్తే 12 లక్షలు ఇస్తానని చెప్పిన మంజునాథ్.. ఆ తర్వాత మాట మార్చాడు. దాంతో బాధితుడు కంగుతిన్నాడు. తనను మంజునాథ్ మోసం చేశాడని గ్రహించి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది.
12 లక్షలన్నాడు.. 5 లక్షలే ఇచ్చాడు..!
12 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని.. కిడ్నీ ఆపరేషన్ తర్వాత కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చాడంటూ పార్థసారధి వాపోయారు. తనను మంజునాథ్ మోసం చేశాడంటూ.. మహారాణి పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు A1 గా మంజునాథ్ ను, A2 గా పేషెంటును, A3 గా శ్రద్ధ హాస్పిటల్ డాక్టర్ ప్రభాకర్ ను, A4 గా వెంకటేశ్ను నమోదు చేశారు. A1 నిందితుడు మంజునాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారోననే కోణంలో విచారిస్తున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలే టార్గెట్.. రెచ్చిపోతున్న దళారులు..!
సాధారణంగా ఒక కిడ్ని చెడిపోయినా కూడా, మరో కిడ్నీతో సాధారణ జీవితం గడిపేయొచ్చు. కానీ, రెండు కిడ్నీలు చెడిపోతే మాత్రం జీవితం దుర్భరంగా మారుతుంది. అలా రెండు కిడ్నీలు పనిచేయనివాళ్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ల కండిషన్ బట్టి వారానికి ఒకరోజు, లేదంటే వారానికి రెండు మూడు సార్లు కూడా డయాలసిస్ అవసరమవుతుంది. రక్తం శుద్ధి చేయడానికి ఓ యంత్రం ఉంటుంది. పేషేంట్ల రక్తం ఆ మెషీన్ లోకి పంపించి శుద్ధి చేసి తిరిగి వారి శరీరంలోకి పంపించే ప్రక్రియను డయాలసిస్ అంటారు. అలా డయాలసిస్ ప్రాసెస్ అనేది అంతా ఈజీ కాదు. ఒకోసారి ప్రాణాలకు కూడా డేంజరే.
అయితే డబ్బున్నవాళ్లు డయాలసిస్ కష్టం భరించరు. లక్షల రూపాయలు పోయినా సరే ఇతరుల నుంచి కిడ్నీ కొనుక్కుందామనే ధోరణితో ఉంటారు. ఆ క్రమంలో నేరుగా కిడ్నీదాతలు దొరకరు కాబట్టి బ్రోకర్లను ఆశ్రయిస్తారు. అందుకే బ్రోకర్లకు కాసుల పంట పండుతోంది. అది చట్టవిరుద్ధమైనా కూడా, అవసరమైన పత్రాలు ఫోర్జరీ చేస్తూ, డూప్లికేట్ తీస్తూ కిడ్నీ ఆపరేషన్లకు తెర తీస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని.. కిడ్నీ దందా చేస్తున్నారు. అయితే కిడ్నీ కావాలనే సమయంలో వారితో మంచిగా మాట్లాడుతూ, అధిక మొత్తం ఆశజూపుతూ.. తీరా ఆపరేషన్ పూర్తయ్యాక మాత్రం హ్యాండిస్తున్నారు. మొదట మాట్లాడినదాని కంటే తక్కువగా ఇస్తున్న బ్రోకర్లు లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసేవారు తక్కువగా ఉంటే.. ఎంత కొంత వచ్చిందిలే అని సర్దుకుపోయేవాళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
బాధితులకు బాధ.. బ్రోకర్లకు కాసుల పంట
గత నెలలో హైదరాబాద్ లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు కావడం సంచలనం రేపింది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మనదేశంలో కిడ్నీ ఆపరేషన్ చేస్తే సమస్యలు ఎదురవుతాయని.. టర్కీ దేశంలో ఆపరేషన్లు చేయిస్తుండటం చర్చానీయాంశమైంది.
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ముఠా దందా.. హైదరాబాద్ కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదుతో వెలుగుచూసింది. అతడి కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సతాయించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు బ్రోకర్ల గుట్టురట్టైంది.