పరారీలో వైసీపీ నేత పీవీపీ.. బెజవాడలో హైదరాబాద్ పోలీసుల గాలింపు.. అంతలోనే సంచలన ట్వీట్లు..
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి చెందిన కీలక నేత, బడా నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మెడకు పోలీసుల ఉచ్చు మరింత బలంగా బిగుసుకుంటోంది. వేర్వేరు కేసులకు సంబందించి విచారణకు కావాలని ఆదేశించగా, పీవీపీ తప్పించుకుని తిరుగుతున్నారని, పరారీలో ఉన్న ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని హైదరాబాద్ పోలీసులు మీడియాకు తెలిపారు. మరోవైపు, అన్ని చోట్లా న్యాయానికి ముప్పుందంటూ నేత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
సాయిరెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారా?.. వైసీపీలో ఎంపీ బాధ్యతలకు భారీ కోత.. సజ్జలకు పెద్ద పీట..
విజయవాడలో తనిఖీలు..
హైదరాబాద్ పరిధిలో బెదిరింపులు, దాడులకు సంబందించి పలు కేసులు ఎదుర్కొంటున్న పీవీపీ విచారణకు హాజరుకావడంలేదని, అలాంటాయన సడెన్ గా విజయవాడలో జరిగిన సీఎం ప్రోగ్రాం(అంబులెన్స్ ఓపెనింగ్)లో ప్రత్యక్షం కావడంతో విజయవాడలో ఉన్నట్లు గుర్తించామని హైదరాబాద్ పోలీసులు చెప్పారు. దీంతో పోలీసు బృందాలు శనివారం విజయవాడలోని హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్లలో తనిఖీలు చేశారు.
బెయిల్ పొందినా ఊరట లేదు..
గత నెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు.14లో తాను విక్రయించిన ఓ విల్లాలోకి పీవీపీతో పాటు ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించి, దాడికి, విధ్వంసానికి ప్రయత్నించారని ఓనర్ కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఒక రోజు పోలీల విచారణకు హాజరైన నేత.. రెండో రోజు విచారణకు హాజరుకాకపోవడం వివాదాస్పదమైంది. అదే సమయంలో ‘‘తప్పు ని తప్పు అనడం తప్పు అయితే, ఆ తప్పు ఎన్ని లక్షల సార్లు అయినా చేయవచ్చు.. నోరు మూసుకునే కన్నా, చావడం మిన్న..''అంటూ పీవీపీ సంచలన ట్వీట్ చేశారు. చివరికి ఈ కేసులో ముందస్తు అరెస్టు కాకుండా తెలంగాణ హైకోర్టు నుంచి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పొందారు. కానీ దాని వల్ల ఊరట మాత్రం లభించలేదు. ఎందుకంటే..
ఈ రెండు కేసుల్లో గాలింపు..
బంజారాహిల్స్ విల్లా కేసులు పీవీపీ బెయిల్ పొందినప్పటికీ.. ఆ కేసులో నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్సై హరీష్రెడ్డి, కానిస్టేబుళ్లపైకి పీవీపీ అనుచరులు కుక్కలను వదిలిన వ్యవహారంలో జూబ్లీహిల్స్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. అలాగే, గతేడాది సెప్టెంబరులో డబ్బుల వ్యవహారంలో తన ఆఫీసు డ్రైవర్ తిమ్మారెడ్డిని బంధించి, దాడి చేసి, బెదిరింపులకు పాల్పడిన ఘటను సంబంధించీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ రెండు కేసుల్లోనే పీవీపీ కోసం గాలిస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సత్తయ్య వివరించారు.
ప్రతిచోటా న్యాయానికి ముప్పు..
తన పరిస్థితిని, ఆలోచనల్ని వివరిస్తూ వైసీపీ నేత పీవీపీ సోషల్ మీడియాలో టైమ్లీ పోస్టులు పెడుతుంటారు. తాజాగా, ‘‘ఎక్కడ అన్యాయం జరిగినా.. ప్రతిచోటా న్యాయానికి ముప్పు వాటిలినట్లే..''అంటూ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటల్ని పీవీపీ ఉదహరించారు. దీన్ని బట్టి ఏపీలోనూ ఆయన నిరాదరణకు గురయ్యారా? అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత వివరణ రావాల్సి ఉంది. పీవీపీ వ్యవహారంలో ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్నా, వైసీపీ నేతలెవరూ ఇప్పటిదాకా స్పందించలేదు.
Recommended Video
రక్షకులే భక్షకులైన వేళ..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తమిళనాడు తండ్రీకొడుకుల హత్యోదంతంపై వైసీపీ నేత పీవీపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో తండ్రీకొడుకులు చనిపోయిన ఘటనలో పోలీసులపైనే కేసులు నమోదు కావడాన్ని ఉదహరిస్తూ రక్షకులే భక్షకులయ్యారంటూ రెండ్రోజుల కిందట ఆయన ఫైరయ్యారు. ‘‘ఆర్మీ వారంటే మనందరికి ఒక ఫ్యాన్ మూమెంట్. అదే కొంతమంది పోలీసులని చుస్తే, తేళ్లు, జర్రిలు పాకుతుంటాయి. తమిళనాడులో పోలీస్ వారిని హత్య నేరంపై అరెస్ట్. అన్ని రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు పబ్లిక్ సెర్వెన్ట్స్ గా, పబ్లిక్ ని సర్వ్ చెయ్యాలని ప్రతి సామాన్యుడి కోరిక'' అని పీవీపీ పేర్కొన్నారు.