కేబీఆర్ విచారణలో కొత్తవిషయాలు: అద్దె ఇంట్లో ఏకే 47!
హైదరాబాద్: అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి పైన కాల్పులు జరిగిన కేసులో నిందితుడిగా భావిస్తున్న ఓబులేష్ తమ తప్పును అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన పలు అంశాలు చెప్పారని సమాచారం.
ఈ ఘటనలో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు అతను చెప్పాడు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది. ఏకే 47 తుపాకీని నార్సింగిలో తాము అద్దెకు తీసుకున్న గదిలో ఉంచారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కానిస్టేబుల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇలా ఉండగా పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఓబులేసుది మొదటి నుంచి క్రిమినల్ మైండేనని, రెండేళ్ల క్రితం కూడా ఓ మాజీ ఐఏఎస్ అధికారిని అతడు కిడ్నాప్ చేసి రూ. 10 లక్షలు వసూలు చేశాడని విచారణలో తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కాగా, గురువారం నాడు ఓబులేష్ కుటుంబ సభ్యులు డీజీపీ కార్యాలయానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారిని పోలీసులు విచారించారని సమాచారం. ఓబులేసుది కడప జిల్లా అని తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
పోరుమామిళ్ళ సిఐ వెంకటకుమార్, ఎస్సై క్రిష్ణం రాజునాయక్ తిరుమంగళాపురం గ్రామానికి వెళ్ళి ఓబులేసు తల్లిదండ్రులు పులి శేషయ్య అలియాస్ మైఖేల్, తిరుపాలమ్మలను విచారించి వివరాలు రాబట్టారు. శేషయ్య, తిరుపాలమ్మ దంపతుల పెద్దకుమారుడు ఓబులేసు 10వ తరగతి వరకు బ్రహ్మంగారిమఠంలో చదివాడు.
ఇంటర్ పోరుమామిళ్ళ జూనియర్ కళాశాలలో చదివి అనంతరం ఎపిఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. 1998లో కడప జిల్లా భాకరాపేట 11వ బెటాలియన్లో శిక్షణ పొందాడు. అనంతరం అంబర్పేట బెటాలియన్కి బదిలీ అయ్యాడు. ఓబులేసు అవివాహితుడు. ఉద్యోగరీత్యా దూరప్రాంతంలో ఉండడంతో గత రెండేళ్లుగా తమతో అంతగా సంబంధాలు లేవని తల్లిదండ్రులు చెప్పారని సమాచారం.