కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు: పోస్టుమార్టంపై రిపోర్టుపై హైదరాబాద్ పోలీసులు ఏమన్నారంటే.?
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకూ తమకు పోస్టుమార్టం రిపోర్టు అందలేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 16, 2019న హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
శివప్రసాద్ మరణంపై అనుమానాలు
మాజీ అసెంబ్లీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య నాడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన మరణంపై పలు అనుమానాలు ఉండటంతో పోలీసులు కోడెల కుటుంబసభ్యులను కూడా విచారించారు. ఆంధ్రప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కోడెల ఆత్మహత్య విషయంలో పరస్పరం దూషణలకు దిగారు.
జగన్ సర్కారు వేధింపులంటూ..
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వేధింపుల వల్లే తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని కోడెల కుమార్తె విజయలక్ష్మితోపాటు ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ సర్కారు తమ తండ్రిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తీవ్ర ఒత్తిడితోనే ఆత్మహత్య..
కోడెలతోపాటు కుటుంబసభ్యులను ఏపీ ప్రభుత్వం మానసికంగా వేధింపులకు గురిచేసిందని, ఈ క్రమంలో తీవ్ర ఒత్తడికిలోనైన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. కోడెల మృతిపై దర్యాప్తు చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆయన సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు ఇంకా అందలేదంటూ పోలీసులు..
కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న గదిలో లభ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, కోడెల శివప్రసాదరావు పోస్టుమార్టానికి సంబంధించిన నివేదిక మాత్రం తమకు ఇప్పటి వరకూ అందలేదని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. మరో పదిరోజుల్లో ఈ రిపోర్టు పోలీసులకు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణను ముందుకు తీసుకెళ్లనున్నారు. దాదాపు మూడు నెలలు గడుస్తున్నా కోడెల పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందకపోవడం గమనార్హం.
వైద్యుడి నుంచి ఏపీ తొలి స్పీకర్ వరకు
కోడెల శివప్రసాదరావు వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పిలుపుతో ఆయన టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్కి సన్నిహితుడిగా మారిపోయారు. హోంమంత్రిగా కూడా పనిచేశారు. నరసరావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత సత్తెనపల్లి నుంచి ఒకసారి గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన మొదటి అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు. స్పీకర్గా వ్యవహరించిన కాలంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ తీసుకెళ్లారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కారు హయాంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి..