మనకు తెలియని మన 'మన్యం పులి': అంతా విఫలం, అతను గురిపెట్టాకే చిరుత హతం..
హైదరాబాద్: మహారాష్ట్రలోని నాసిక్, జలగావ్ అడవులను ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలను గత ఐదు నెలలుగా ఓ చిరుత తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది.
ఇప్పటి వరకు ఏడుగురిని చంపడంతో పాటు లెక్కకు మించి అటవీ జంతువులను హరించింది. దీంతో ఈ చిరుతను చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో పెట్టారు. చివరకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫాత్ అలీఖాన్ దాన్ని మట్టుబెట్టడం విశేషం.
అంతా విఫలం:
చిరుత భయంతో పరిసర ప్రాంతాల ప్రజలు గడగడలాడిపోతున్నారు. మరోవైపు అధికారులు, వేటగాళ్లు, పోలీసులు.. చిరుతను పట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలన్ని విఫలమవుతూ వస్తున్నాయి. విషయం తెలుసుకున్న హైదరాబాద్ షార్ప్ షూటర్ షఫాత్ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది.
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే.. షార్ప్ షూటర్స్ అవసరం ఏర్పడితే.. వెంటనే షఫాత్ అలీని పిలిపిస్తుంటారు. గతంలోను అటవీ శాఖ తరుపున ఆయన పలు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు షఫత్.
ఆరు రోజులు గాలింపు:
చిరుత కోసం దాదాపు 6 రోజుల పాటు షఫాత్ అలీ ఖాన్ జలగావ్ అడవులను జల్లెడ పట్టారు. చివరకు జలగావ్ జిల్లాలోని చాలీస్గావ్ తహసీల్ కేంద్రంలోని వార్ఖేడా గ్రామం సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.
గురిపెట్టి కాల్చేశాడు:
శనివారం రాత్రి 11గంటల సమయంలో చిరుతను గుర్తించినప్పటికీ.. ఆ సమయంలో దాన్ని పట్టుకోవడానికి ఎటువంటి అవకాశం లేకపోయినట్లు తెలుస్తోంది. ఒక దశలో చిరుత ఎదురుదాడికి దిగడంతో అటవీ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. కానీ షూటర్ అలీ ఖాన్ నేర్పుగా దాన్ని గురిపెట్టడం కాల్చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
12 బృందాల వేట:
చిరుతను వేటాడటం కోసం 22మంది షార్ప్షూటర్లు 12 బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడ పట్టారు. చిరుత అడుగు జాడల ఆధారంగా అది సంచరిస్తున్న ప్రాంతాన్ని ఎట్టకేలకు గుర్తించగలిగారు.
నవాబ్ షఫాత్ అలీఖాన్, అతని కుమారుడు అస్గర్ అలీ ఖాన్లతో పాటు ఔరంగాబాద్ షార్ప్ షూటర్ డాక్టర్ షహాద్ నఖ్షాబంది, డాక్టర్ సవూద్ నఖ్షాబంది, ఎమ్మెల్యే ఉమేశ్పాటిల్, అటవీశాఖ అధికారులు టిఎన్ సాలుంఖే, ఆదర్శ్కుమార్రెడ్డి సమక్షంలో ఈ ఆపరేషన్ కొనసాగింది.