సోమాలియాలో కొడుకు అదృశ్యం: సాయం కోసం సుష్మా-పవన్ కళ్యాణ్లకు విజ్ఞప్తి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం నెగ్గిపూడికి చెందిన భరత్ నాగేంద్ర మణికంఠ సోమాలియాలో షిప్ నుంచి అదృశ్యమయ్యారు. అతను అదృశ్యమై దాదాపు వారం రోజులు అవుతోంది. ఆయన జాడ ఇప్పటి వరకు తెలియరాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తన కుమారుడి జాడ కనుగోనాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ట్విట్టర్ ద్వారా తమ గోడు విన్నవించుకున్నారు. జనవరి 16వ తేదీ నుంచి అతను ఫ్యామిలీతో కాంటాక్ట్లో లేరు. తాను సంతోషంగా ఉన్నానని అంతకుముందు ఓ సందేశం వచ్చిందని, కానీ ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లేదని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.
స్వదేశానికి బయలుదేరిన సమయంలో
పశ్చిమ గోదావరి జిల్లాలోని నెగ్గిపూడికి చెందిన దుర్గాప్రసాద్, ఝాన్సీలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కూతురుకు పెళ్లయింది. దుర్గాప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. పెద్ద కొడుకు భరత్ నాగేంద్ర మణికంఠ చెన్నైలోని వెస్ట్ లైన్ షిప్పింగ్ కంపెనీలో ఇంజనీర్ కేడర్గా చేరారు. శిక్షణ అనంతరం కంపెనీకి చెందిన కార్గో షిప్లో గల్ఫ్ వెళ్లాడు. ఇరాన్, ఇరాక్లలో పని ముగిసిన తర్వాత స్వదేశానికి బయలుదేరారు.
సోమాలియాలో ఆగినప్పుడు
తిరుగు ప్రయాణంలో షిప్ ఈ నెల 16వ తేదీన రాత్రి సోమాలియా దేశంలో ఆగింది. అప్పుడు బయటకు వెళ్లిన మణికంఠ ఆ తర్వాత షిప్పులోకి రాలేదని తెలుస్తోంది. మసురటి రోజు ఉదయం వరకు మణికంఠ కోసం సిబ్బంది వేచి చూశారు. భరత్తో పని చేస్తున్న శివ అనే యువకుడు ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు చెప్పారు.
సుష్మా, పవన్లకు విజ్ఞప్తి
దీంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సుష్మాకు తెలిపారు. వెంటనే స్పందించిన సుష్మా సోమాలియాలో ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు. భరత్ ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. తమ కొడుకు ఆచూకీ కనుగొనేందుకు సహాయం చేయాలని పవన్ కళ్యాణ్కు కూడా ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Recommended Video
తల్లిదండ్రుల ఆందోళన
భరత్ ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమాలియాలో సముద్ర దొంగలు ఎక్కువ. పడవల్లోని సిబ్బందిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు.