విశాఖ గీతం వర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: నగరంలోని రుషికొండ ప్రాంతంలో ఉన్న గీతం యూనివర్సిటీలోని హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్ధిని శ్రేయ ప్రసాద్ (19) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన శ్రేయ ప్రసాద్ గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీ హాస్టల్లోనే ఉంటోంది. శుక్రవారం తరగతులకు వెళ్లిన ఆమె మధ్యాహ్నాం హాస్టల్లోని తన తరగతి గదికి వచ్చేసింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుకుంటూ కన్నీరుపెట్టింది.
ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల మధ్య తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితులు గదిలోకి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్య సమాచారాన్ని కళాశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది.