హైదరాబాద్ టూ అమరావతి ప్రత్యేక బస్సులు- ఆ 400 మంది కోసమే...
హైదరాబాద్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు వీలుగా తెలంగాణ సర్కారు ప్రత్యేక బస్సులకు అనుమతి ఇచ్చింది.తమ ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక బస్సులకు అనుమతివ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. సుమారు 400 మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బస్సులకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతినిచ్చింది.హైదరాబాద్ నుంచి ఏపీకి తొలిదశలో 250 మందిని తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
ఒక ఏసీ బస్సుతోపాటు మిగిలినవి సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి ఈ బస్సులు బయలుదేరాయి. రేపటి కల్లా ఇవి ఏపీ ఉద్యోగులను అమరావతికి చేర్చనున్నాయి. ప్రతీ వారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే ఉద్యోగులు లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఏపీ సచివాలయ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో వీరిని ఏపీకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.