చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ- లక్ష్మీపార్వతి పిటిషన్పై ఏసీబీ కోర్టులో..
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమాస్తులపై విచారణ కోరుతూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ మరోసారి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన ఆస్తుల ఆధారంగా లక్ష్మీపార్వతి గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా అక్రమాస్తులను పెంచుకున్నారని ఆరోపిస్తూ గతంలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుంచి పొందిన స్టే ఈ మధ్య వరకూ కొనసాగింది. అయితే పెండింగ్లో ఉన్న స్టేలు ఎత్తేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు స్టే ఎత్తేశారు. దీంతో ఈ కేసు రెగ్యులర్ విచారణ కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఈ విచారణకు ఆటంకం కలిగింది.
Recommended Video
కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో హైదరాబాద్లో పలు కోర్టుల కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆస్తుల కేసు కూడా విచారణకు వచ్చింది. దీనిపై ఇవాళ వాదనలు విన్న న్యాయస్ధానం వచ్చే నెల 21కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం పరిష్కరించాలని కేంద్రం, సుప్రీంకోర్టు నుంచి ఒత్తిడి పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ కేసులోనూ సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ఏసీబీ కోర్టు సిద్దమవుతోంది.