ఇప్పటి వరకు పవన్ ఒంటరి పోరాటం, ఇది చూసి ఆయన కళ్లలో ఆనందం: హైపర్ ఆది
ధవళేశ్వరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిస్వార్థ రాజకీయ నాయకుడు అని జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది అన్నారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కవాతు అనంతరం జనసేనాని మాట్లాడే వేదిక వద్ద హైపర్ ఆది మాట్లాడారు. జై పవన్ కళ్యాణ్ గారు, ఆయన కాసేపట్లో వస్తారని క్లుప్తంగా ప్రసంగించారు.
ఇంతమంది (కవాతుకు వచ్చిన లక్షలాది మందిని ఉద్దేశించి) జనాలను చూస్తే పవన్ కళ్లలో ఆనందం పొంగిపోతుందన్నారు. ఇప్పటి వరకు ఆయన ఒంటరిగా పోరాటం చేశారని, ఈ ఒక్కరోజు వచ్చిన అభిమానగణాన్ని చూస్తే ఆయన సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు.
నన్ను గుర్తుంచుకోండి: అభిమానులకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు చురకలు
అందరూ పవన్ కళ్యాణ్కు ఓటు వేయమని హైపర్ ఆది
ఈ కవాతుకు, జనసేన సభకు వచ్చిన వారు అందరూ జనసేనానికి ఓటు వేస్తే ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని హైపర్ ఆది అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోకి పవన్ జనసేన పోరాట యాత్ర
కాగా, పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కాటన్ వంతెనపై ఏర్పాటు చేసిన భారీ కవాతు ఉత్సాహంగా సాగింది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ధవళేశ్వరం బ్యారేజీపై భారీ సంఖ్యలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు, జనసేనకు జై అంటూ నినదిస్తూ ముందుకు సాగారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఉత్సాహం నింపిన పద.. పద.. పాట
ఈ కవాతు సందర్భంగా రూపొందించిన పదా.. పద.. పద పాట జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పిచ్చుకులంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు సుమారు 2.5 కిలో మీటర్ల మేర ఈ కవాతు జరుగుతుంది. ఈ కవాతు సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీకి ఇరువైపులా జనసేన జెండాలతో భారీగా ముస్తాబు చేశారు.
గోదావరి నదిలో పడవలపై జనసేన పతాకాలతో సందడి
గోదావరి నదిలో పడవలపై జనసేన పతాకాలతో కార్యకర్తలు సందడి చేశారు. అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఓపెన్ టాప్ వాహనంలో జనసేనాని కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.