మోడీ! సీఎంగా ప్రశ్నిస్తున్నా జవాబివ్వు, నిధులివ్వరా చెప్పండి, క్లింటన్ పొగిడారు: అసెంబ్లీలో బాబు
అమరావతి: ఈ గడ్డ (ఆంధ్రప్రదేశ్) పైన పుట్టిన వారంతా తమకు మద్దతివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో అన్నారు. తాము ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పారు. మనకు ఇవ్వాల్సినవి కేంద్రం ముష్టి కాదని, ఏపీ హక్కు అని చెప్పారు. పట్టిసీమపై ఇప్పుడు బీజేపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ఆత్మగౌరవం అంటే ఎగతాళి చేస్తారా అన్నారు. ఆత్మగౌరవం లేకుంటే గుర్తింపు, మనుగడ లేదన్నారు. యూసీలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు.
పోలవరం, అమరావతి పనులు ఆగే సమస్యే లేదన్నారు. రాజధాని కోసం విలువైన సూచనలు ఇచ్చిన ప్రధాని మోడీలో మార్పు వచ్చిందన్నారు. సూటిపోటి మాటలు, సన్నాయి నొక్కులు ఎందుకని ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలు ఏమాత్రం సరికాదన్నారు. ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాల్సిందేనని, సహకరించాల్సిందేనని వైసీపీ, జనసేన, ప్రజా సంఘాలను ఉద్దేశించి అన్నారు.
కేంద్రం ఇచ్చేది సొంత డబ్బు కాదు
యూసీలు ఇస్తే తప్పుడువి అని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అమరావతికి రూ.1500 కోట్లకు యూసీలు ఇచ్చామని చెప్పారు. తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిశామన్నారు. ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చేవి సొంత డబ్బులు కాదన్నారు. పారిశ్రామికరాయితీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అవి కూడా లేవని అంటున్నారని చెప్పారు. అవిశ్వాసంపై చర్చించే బాధ్యత లేదా అన్నారు. కేంద్రం ఇచ్చేది తన సొంత డబ్బు కాదన్నారు. బురద జల్లే ప్రయత్నం చేయవద్దన్నారు.
అమిత్ షా చెప్పారు, ఏపీ సీఎంగా ప్రధానిని అడుగుతున్నా
నాడు బిల్ క్లింటన్ హైదరాబాదును పొగిడారని చంద్రబాబు చెప్పారు. ఇదంతా తన కోసం కాదని, తన స్వార్థం కోసం కాదన్నారు. ఈ రోజు ప్రపంచమంతా తిరుగుతున్నానంటే తన కోసం కాదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందితే బీజేపీ చూడలేకపోతోందన్నారు. యూసీలు పంపించలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెబుతున్నారని, అది సరికాదన్నారు. ఓ రాష్ట్ర సీఎంగా తాను ప్రధానిని అడుగుతున్నానని, మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. కేంద్రానికి జవాబుదారీతనం లేదా అని ప్రశ్నించారు.
కేంద్రం కావాలని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది
కేంద్రం కావాలని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ఏపీకి సాయం పార్టీల వ్యవహారం కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమస్య అన్నారు. యూసీలు అన్నీ పంపించినా ఇవ్వలేదని చెప్పడం సరికాదన్నారు. బీజేపీ ఏపీని ఫాలో అవుతోందని, యూపీలో మన స్కాంలను అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీతో పొత్తు కారణంగా గత ఎన్నికల్లో 15 సీట్లు తగ్గాయన్నారు. నిధులు ఇవ్వకుంటే చెప్పాలని, బురద జల్లే ప్రయత్నం చేయవద్దన్నారు. కేంద్రం తీరు పుండుమీద కారం చల్లినట్లుగా ఉందని, అవసరమైతే అభివృద్ధి కోసం ప్రత్యేక బాండ్లు తెస్తామన్నారు.
పోలవరంపై లెక్కలు చూపలేదనడం సరికాదు
అన్నింటికి సమాచారం పంపించామని, తెలిసి జరిగితే ఐదు కోట్ల మందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోడీకి ఉందని, తెలియక జరిగితే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. చెడు కలలు మాకు రావడం లేదని, మీకు వస్తున్నాయన్నారు. మేం వాస్తవాలు చెబుతున్నామన్నారు. టీడీపీ ధర్మపోరాటం చేస్తోందని, అంతిమ విజయం న్యాయానిదే అన్నారు. ఓ సీఎంగా నేను ప్రధానిని అడుగుతున్నానని, నేను యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఇవ్వలేదని చెప్పారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని, ప్రధాని లేదా కేంద్రమంత్రులు చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై లెక్కలు చూపలేదనటం సరికాదన్నారు.
మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా
ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని కేంద్రాన్ని చంద్రబాబు హెచ్చరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం అవాస్తవాలు చెబితే ఇబ్బందులు వస్తాయని మండిపడ్డారు. వడ్డించే వాడు మనవాడు అయినప్పుడు ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదన్నారు. మేం హక్కుల కోసం పోరాడుతామన్నారు. కేంద్రం మనకు సొంత డబ్బు ఇవ్వలేదని, మనం కూడా పన్నులు చెల్లిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఆగదని, అది తన భరోసా అన్నారు. సుపరిపాలన తానే తెచ్చానని చెప్పారు.
అహ్మదాబాద్ కోసం మోడీ పోరాడలేదా
అహ్మదాబాద్ కోసం గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ పోరాడలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని కోసం వినూత్న రీతిలో నిధులు సమీకరిస్తామన్నారు. దేశాన్ని పాలించే పార్టీలకు జాతీయ భావాలు ఉండాలని, ప్రాంతీయ చిచ్చు రాజేస్తారా అని ప్రశ్నించారు. మనం అహింసాయుతంగా మన హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. కొందరు అశాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. హక్కుల కోసం అడిగితే ఎదురుదాడి చేస్తున్నారన్నారు.