పవన్ కళ్యాణ్ కంటే గొప్ప లీడర్ని, రోజా నోటి దురుసు తగ్గించు: జవహర్
గుంటూరు: నగరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యో రోజా నోటి దురుసు తగ్గించుకోవాలని మంత్రి జవహర్ సోమవారం హితవు పలికారు. ఏపీలో రోజా శూర్పణక పాత్ర పోషిస్తోందన్నారు. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కష్టాలు తప్పవని ఎద్దేవా చేశారు.
'శ్రీలక్ష్మి మాటేమిటి, భారతి తప్పించుకోలేరు, భార్యను లాగిందే జగన్'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి ఈడీ కేసులతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబుపై రోజా చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము నవ్యాంధ్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. జగన్ కేసుల మాఫీ కోసం బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.
పవన్ అంటే గాలి అని, గాలి మాటలను ప్రజలు నమ్మరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి జవహర్ అన్నారు. పవన్ను పట్టించుకునే తీరిక తమకు లేదని చెప్పారు. తన కమ్యూనిటీలో పవన్ కంటే తాను గొప్ప నాయకుడిని అని చెప్పారు.
Recommended Video
కాగా, ఆదివారం రోజా మాట్లాడుతూ... రావణాసురుడు సీత జోలికి వెళ్లాకే అతడి పతనం ప్రారంభమైందని, ఇప్పటిదాకా వివిధ కేసుల పేరిట జగన్ను వెంటాడిన చంద్రబాబు ఇప్పుడు భారతిని లక్ష్యంగా ఎంచుకున్నందున ఆయన ప్రభుత్వానికీ కౌంట్ డౌన్ తప్పదన్నారు.
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావులు జగన్ భార్య భారతిపై ఆరోపణలు చేస్తున్నారని, వీరు బ్యాంకులను మోసగించినవారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల స్థాయి ఏమిటో తునిలో జగన్ పాదయాత్రకు హాజరైన అశేష జనవాహినితో అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలు సైతం ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నారు.