ఏ పార్టీలో లేను: కొత్తపల్లి గీత, నకిలీ బంగారం పేరుతో ఎంపీకి కొత్త షాక్
ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీ నుంచి పని చేయడం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తాను ఇండిపెండెంటుగా ఉన్నట్లు ఆమె తేల్చి చెప్పారు. ఆమె 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు.
అమరావతి: ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో లేనని, ఏ పార్టీ నుంచి పని చేయడం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తాను ఇండిపెండెంటుగా ఉన్నట్లు ఆమె తేల్చి చెప్పారు. ఆమె 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు.
కానీ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అలాగని టీడీపీ వైపు కూడా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
జగన్పై ఆగ్రహం, జనసేన వైపు చూస్తున్నారా
కొద్ది రోజుల క్రితం ఆమె వైసీపీ అధినేత జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరని, అది మూర్ఖత్వమేనని మండిపడ్డారు. జగన్ పాదయాత్ర ఓ పొలిటికల్ స్టంట్ అన్నారు. ఆ సమయంలోనే ఆమె మరో పార్టీ వైపు చూస్తున్నట్లుగా భావించారు. కానీ ప్రస్తుతం తాను ఇండిపెండెంటుగా ఉన్నట్లు చెప్పారు. ఆమె జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం సాగింది.
కొత్తపల్లి గీతకు బెదిరింపులు
చాలామంది ఎంపీలకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని, ఈ అంశంపై రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రయివెంటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని ఎంపీ కొత్తపల్లి గీత మరో సందర్భంలో అన్నారు.
బంగారం నకిలీది అంటూ
కాగా, గతంలో హైదరాబాదులో వందల కోట్ల భూకుంభకోణం, కులవివాదం, ఫిరాయింపు.. ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న కొత్తపల్లి గీతకు మరో షాక్ తగిలింది. 'ఇటీవల మీరు కొన్న బంగారం నకిలీదని తేలింది. ఏసీబీ మీపై కేసు దాఖలు చేసింది. ఆ దస్త్రం కావాలంటే ఈ ఖాతాలో సొమ్ములు వేయండం'టూ తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ మెయిల్ వచ్చిందని ఆమె చెప్పారు.
ఖాతాలో డబ్బులు జమ చేయాలని
ఎస్బీఐ ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు గీత తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే విశాఖపట్నంలో ఫిర్యాదు చేశానన్నారు. గతంలో తన కుమారుడు కార్డు నుంచి రూ.12వేలు తస్కరించారని ఢిల్లీలో ఫిర్యాదు చేసి ఎనిమిది నెలలైనా పురోగతి లేదన్నారు. సైబర్క్రైం అంశాలకు సంబంధించి త్వరలోనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.