బాబు అడక్కుండానే ఇచ్చారు, నా అదృష్టం: వారిలో ఆవేదనంటూ పితాని
తానెప్పుడూ మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అడగలేదని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబే స్వయంగా నిర్ణయించి తనకు కేబినెట్లో చోటు కల్పించారని అన్నారు.
అమరావతి: తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న పితాని సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ మంత్రి పదవి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అడగలేదని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబే స్వయంగా నిర్ణయించి తనకు కేబినెట్లో చోటు కల్పించారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని ప్రకటించారు. ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు పితాని ప్రకటించారు.
మంత్రి హోదాలో శుక్రవారం తొలిసారి ఏలూరు వచ్చిన పితాని ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విప్ ప్రభాకర్ హాజరవుతారని భావించినా ఆయన రాలేదు. దీంతో ఆయన రాక కోసం రెండున్నర గంటల పాటు మంత్రి గెస్ట్హౌస్లోనే గడిపారు.
ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు.. ప్రభాకర్ను మంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్పందించిన పితాని తనకు భేషజాలు లేవని, తానే స్వయంగా ప్రభాకర్ను కలుస్తానని తెలిపారు. పార్టీ పరంగా అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి పితాని స్పష్టం చేశారు.
ఆవేదన ఉంటుంది కానీ..
కార్యకర్తలు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారని, ఎమ్మెల్యేలు మంత్రి కావాలని కోరుకుంటారని, ఇలా ఆశపడడం తప్పులేదని, అయితే అందరికీ అవకాశాలు రావని, ప్రాంతాలు, కుల, మత, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం ప్రకారం 25 మందికి మాత్రమే మంత్రివర్గ చోటు లభిస్తుందని పితాని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో నేర్పుతో మంత్రివర్గాన్ని విస్తరించారని వెల్లడించారు.
'పదవులు రాలేదని కొంతమంది ఆవేదనతో ఉన్న మాట వాస్తవమే. ఆవేశం విడనాడి ఆలోచనతో ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుంద' అని మంత్రి పితాని చెప్పారు. ఏ రోజూ మంత్రి పదవి కావాలని అడగలేదని, సీఎం చంద్రబాబు పిలిచి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 2019 ఎన్నికల్లో 80 శాతం మంది ప్రజలు టీడీపీ పక్షాన ఉండేలా చూస్తానన్నారు. తుందుర్రు సమస్యలను పరిష్కరించడానికి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానని ప్రకటించారు.