టిటిడి చైర్మన్ ఇష్యూ: శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత, నేను పక్కా హిందువును: పుట్టా సుధాకర్
గుంటూరు: పుట్టా సుధాకర్ యాదవ్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించడాన్ని తప్పుబట్టిన శైవక్షేత్రం మఠాదిపతి శివస్వామి వ్యాఖ్యలకు నిరసనగా పలువురు యాదవ సంఘాల నేతలు ఆదివారం శైవక్షేత్రం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అమరావతిలో ఉద్రిక్తత ఏర్పడింది.
తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రాన్ని శివస్వామి నిర్వహిస్తున్నారు. దానిని ముట్టడించేందుకు పలువురు యాదవులు తరలి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించారు. కరకట్ట రహదారిని పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకొని ఎవరూ లోపలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ను నియమించారు. దీనిపై పలువురు స్వామీజీలు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రైస్తవులకు మద్దతుగా ఉండే పుట్టాను ఎలా నియమించారని ఆగ్రహిస్తున్నారు.
నామినేటెడ్ పోస్ట్ల భర్తీ: టీటీడీ చైర్మన్గా పుట్టా, కిరణ్ రెడ్డి సోదరుడికి కీలక పదవి
మరోవైపు, పుట్టాపై అసత్య ప్రచారం సాగుతోందని టీడీపీ శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించింది. అలిపిరి వద్ద తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీవారిని ప్రార్థించే కార్యక్రమాన్ని చేపట్టారు.
మైదుకూరు రాయల్ కూడలిలో శివుడి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వెంకటేశ్వర స్వామికి మొదట సేవ చేసే వ్యక్తి యాదవ్ అన్నారు. బీజేపీ, పీఠాధిపతి శివస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, బీజేపీ, పీఠాధిపతి పుట్టాను ప్రశ్నించారు. కానీ యాదవుల అంశం లేదంటున్నారు.
తాను యాదవుడినే అని, క్రిస్టియన్ను కాదని పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. మైదుకూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లడంతో తనను క్రిస్టియన్ అని అవమానిస్తున్నారన్నారు. శివస్వామి మాటల వెనుక కుట్రలు దాగి ఉన్నాయని, వాటిని ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ఏడు కొండలను రెండు కొండలు చేసే ప్రయత్నం చేశారని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఈ స్వాములంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు.
భూమన, వైయస్ అగ్రకులాల వారు కాబట్టి ఈ స్వాములంతా అప్పుడు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. తాను టీటీడీ సభ్యుడిగా ఉన్నప్పుటు ఎస్సీ, ఎస్టీల వాడల్లో ఆలయాలు కట్టించానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు మతం మారుతున్నారని చెప్పి తాను 30 నుంచి 40 గుళ్లు కట్టించానని చెప్పారు. సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతున్న యాదవ కులాన్ని అణగదొక్కేందుకే ఇలా తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.