మీరిస్తేనే అసెంబ్లీలో చెప్పా, పత్తిపాటితో నాకేం శత్రుత్వం: బాధితులతో జగన్
మంత్రి పత్తిపాటి పుల్లారావు తనకు శత్రువు కాదని, చైర్మన్ తమ్ముడు ఎవరో కూడా తనకు తెలియదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు.
అమరావతి: మంత్రి పత్తిపాటి పుల్లారావు తనకు శత్రువు కాదని, చైర్మన్ తమ్ముడు ఎవరో కూడా తనకు తెలియదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వగా మిగతా మొత్తాన్ని తాము అధికారంలోకి వచ్చాక పువ్వుల్లో పెట్టి ఇస్తామని జగన్ చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్ద జగన్ మాట్లాడారు.
చంద్రబాబు ప్రభుత్వంపై రోజా నిప్పులు
అసెంబ్లీలో అగ్రిగోల్డ్ చర్చకు తాము పట్టుబట్టామని, దానిపై ముందుగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చదివారని జగన్ చెప్పారు. తర్వాత పది నిమిషాలు, 20 నిమిషాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు చెప్పారన్నారు.
బాధితుల బాధను ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలనుకున్నా వీలుపడలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటి వరకు మరణించిన 105 మందికి పరిహారం ఇవ్వాలని అడిగామన్నారు.
పత్తిపాటితో శతృత్వం లేదు
మామూలుగా చనిపోయిన వాళ్లకే రూ.5 లక్షలు ఇస్తున్నప్పుడు, కనీసం ఈ బాధితులకు ఆ డబ్బు ఇవ్వాలని అడుగుదామంటే వారికి వినే ఓపికనే లేకుండా పోయిందన్నారు. తనకు పత్తిపాటితో వ్యక్తిగత శత్రుత్వం లేదని, మీరంతా (అగ్రిగోల్డ్ బాధితులు) నా వద్దకు వచ్చి సాక్ష్యాలు చూపించిన తర్వాత అన్యాయం గురించి అసెంబ్లీలో ప్రశ్నించానని చెప్పారు.
మీరు చూపించిన డేటానే చూపించి..
మంత్రిగా ఉన్న తర్వాత... ఆస్తులు అటాచ్ అవుతున్న విషయం తెలిసి పత్తిపాటి తన భార్యతో తక్కువ రేటుకు కొనిపించారని మీరు చూపించిన డేటాను అసెంబ్లీలో చూపించానని, ఆయన మంత్రి స్థానంలో ఉండి కొన్నారని, అటాచ్ జరగబోతుందని తెలిసి కొన్నారని తాను సభలో చెప్పానన్నారు.
మైక్ కట్ చేశారు
అమ్మిన వ్యక్తి చైర్మన్ బంధువుేనని చెప్పానని, హాయ్ ల్యాండ్లో డైరెక్టర్గా ఉన్న విషయం చెప్పి దీనిపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశానని, ఇప్పుడు కూడా చేశానని చెప్పారు. అగ్రిగోల్డ్ టాపిక్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారన్నారు.
వారి తిట్లు నాకు ఆశీర్వాదం
అధికార పార్టీ వారి తిట్లను నేను ఆశీర్వాదంగా తీసుకుంటానని జగన్ చెప్పారు. కానీ బాధితులకు న్యాయం జరిగితే చాలన్నారు. సబ్జెక్టును పక్కదారి పట్టించారన్నారు. 40 రోజుల క్రితం మహిళా పార్లమెంటు సందర్భంగా స్పీకర్ వెటకారంగా అన్న మాటలను అన్ని ఛానళ్లు ప్రసారం చేశాయని చెప్పారు. కానీ ఈ రోజు అగ్రిగోల్డ్కు సంబంధం ఏముందని అడిగితే పట్టించుకోలేదన్నారు.
కౌరవ సభ చూడలేకే
కౌరవ సభను చూడడానికి కూడా మనసొప్పక తాను అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు. కచ్చితంగా దీనిపై పోరాటం చేస్తామని, మీకు అండగా ఉంటామని చెప్పారు. చంద్రబాబు చర్మం మందం కాబట్టి ఫలితం వస్తుందన్న నమ్మకం లేదని చెప్పారు. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడుస్తాయన్నారు. ఆ తర్వాత మన ప్రభుత్వమే వస్తుందన్నారు.