రాజకీయ ఆరంగేట్రంపై బ్రహ్మానందం: కృష్ణంరాజు మొదలు
తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదనీ, ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదనీ స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా టాలీవుడ్ ప్రముఖులు నరేంద్ర మోడీని కలుస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, నిన్న నాగార్జున కలిశారు. మరికొందరు తారలు కలిసే అవకాశముందంటున్నారు.
2013 ఆగస్టు 11న హైదరాబాద్కు వచ్చిన మోడని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు కలిశారు. కరచాలనాలు చేశారు. ఫొటోలు దిగారు. దీనికి కొంత రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు మరింత పెరిగింది. మోడీ పట్ల, ఆయన ప్రధాని అభ్యర్థిగా ఉన్న బిజెపి పట్ల టాలీవుడ్ ప్రముఖుల్లో ఆసక్తి పెరుగుతోంది. పవన్, నాగార్జునల తర్వాత మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిత్రం మారిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అంటేనే నాయకులు ఆమడదూరం పారిపోయే పరిస్థితి నెలకొంది. ఇక తెలుగుదేశానికి సినీ ప్రముఖుల మద్దతు అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు కొత్తగా మోడీ హవా మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ నాయకత్వం అవసరమని పవన్ పేర్కొన్నారు. నాగార్జున కూడా నిన్న అదే మాట చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రలోనూ బీజేపీ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కృష్ణం రాజుతో మొదలై...
కృష్ణంరాజు గతంలో బిజెపి టికెట్తో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీకి దూరమైన ఆయన తిరిగి కమలం గూటికి చేరారు. నటి జీవిత ఈ మధ్యే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పవన్ నేరుగా గాంధీనగర్ వెళ్లి మోడీని స్వయంగా కలిసి మద్దతు ప్రకటించారు. త్వరలో మరో ఇద్దరు స్టార్లు మోడీని కలవబోతున్నారని వార్తలు వచ్చాయి.
దీనిని నిజం చేస్తూ సోమవారం నాగార్జున గుజరాత్కు వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. నాగార్జున ఇప్పటికే వెంకయ్యనాయుడుని కలిశారనీ, తన సతీమణి అమలకు విజయవాడ పార్లమెంట్ సీటును ఇప్పించాల్సిందిగా కోరారనీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలపాలని నిర్ణయించుకుని... అందులో భాగంగానే మోడీని కలిసినట్లు తెలుస్తోంది.
ఇక, మోహన్ బాబు సైతం త్వరలో మోడీని కలిసి మద్దతు ప్రకటించే అవకాశముందంటున్నారు. మోడీ గత ఏడాది హైదరాబాద్కు వచ్చినప్పుడు మోహన్బాబు తన కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు విష్ణుతో పాటు కలిశారు. ఇటీవల తిరుపతిలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధించి త్వరలో సంచలన ప్రకటన చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.