సీబీఐ విచారణకు నేను సిద్ధం... మీరు సిద్ధమా?:రమణ దీక్షితులు సవాల్
Recommended Video
హైదరాబాద్:తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని...మరి నాపై ఆరోపణలు చేసిన వారు సిద్ధమా?...అని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సవాల్ విసిరారు. సోమవారం రమణ దీక్షితులు సికింద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు.
ప్రతాపరుద్రుడు స్వామి వారికి సమర్పించిన అమూల్యమైన సంపద...అన్నపోటు వద్ద నిధిగా ఉందని బ్రిటీష్వారి శాసనంలో ప్రస్తావించారని...అందుకే అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు ఆరోపించారు. అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని, వారసత్వంగా వచ్చిన ఇంటిని కక్షపూరితంగా కూల్చివేశారని రమణ దీక్షితులు ఆరోపించారు.
వాళ్లు...ఏలినాటి శని...
జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శనిలాంటి వారని రమణ దీక్షితులు విమర్శించారు. బాలసుబ్రమణ్యం హయాంలోనే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేశారని, దీని వెనుక ఆయనకు లాభం ఉందన్నారు. బాలసుబ్రమణ్యం తనకు రోజుకు 50 రూపాయలు కూలీ అని ఏర్పాటు చేశారు. అది ఆ తరువాత నెలకు రూ.3 వేలు నుంచి రూ.7 వేలు అయ్యింది. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు రూ.60 వేలు వేతనంగా ఇచ్చారు. అదికూడా కోర్టు నిర్ణయం ప్రకారమే నని తెలిపారు.
అవమానాలు...హత్యాయత్నాలు
తాను ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడే...తన ముందే డాలర్ శేషాద్రిని ప్రధాన అర్చకునిగా చెప్పేవారని, కొంతమంది వీఐపీలు వస్తే కనీసం తనను అర్చకునిగా కూడా పరిచయం చేసేవారు కాదని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చవద్దని...దాన్ని కాపాడాలని, మాస్టర్ ప్లాన్లో భాగంగా తప్పనిసరిగా కూల్చాల్సివస్తే మరోచోట నిర్మించాలని వినతిపత్రం కూడా ఇచ్చానన్నారు. దీంతో తనపై కక్ష్య కట్టి వంశ పారంపర్యంగా ఉన్న తన ఇంటిని కూల్చివేశారన్నారు. జెఈవో హయాంలోనే తనపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగిందని చెప్పారు. ఆ ధర్మారెడ్డి ఉద్యోగం కోసం క్రైస్తవ మతం మార్చుకున్న ఘనత కూడా ఉందని...ఈ విషయం ఢిల్లీలో హోంశాఖ వారి ద్వారా తెలిసి తాను ఎంతో బాధ పడ్డానన్నారు.
నిధి ఉంది...అందుకే తవ్వకాలు
ప్రతాపరుద్రుడు ఏడుకొండల స్వామి వారికి సమర్పించిన అమూల్యమైన సంపద అన్నపోటు వద్ద నిధిగా ఉందని బ్రిటీష్ శాసనంలో ప్రస్తావించారని రమణ దీక్షితులు గుర్తుచేశారు. అందుకోసమే అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని ఆరోపించారు. అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్ చేశారని ఆరోపించారు. జేఈవోల నిరంకుశత్వాన్ని, బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రశ్నించకూడదా అని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు....టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం
నేడు తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం నిర్వహణకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎజెండా ఖరారైంది. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడానికి ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. భక్తకోటిలో తలెత్తిన అనుమానాలు నివృత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సమావేశంలో ప్రారంభంలోనే రమణ దీక్షితులుపైనే ప్రత్యేక చర్చ జరిగే అవకాశాలున్నాయి. భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించడం, స్వామివారి కైంకర్యాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం లాంటి ప్రతిపాదనలను ఈవో సింఘాల్ ఈ సమావేశం ముందు ప్రతిపాదించే అవకాశం ఉంది.
సవరణలు...పొడిగింపులు
తితిదే ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ శర్మిష్ట డిప్యుటేషన్ కాలపరిమితి, శ్వేత సంచాలకులు ఎన్.ముక్తేశ్వరరావు ఒప్పందం కాలం త్వరలో ముగుస్తోంది. ఈయన పదవీకాలం పొడిగింపుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తుండగా ముక్తేశ్వరరావు కొనసాగింపుపై మాత్రం కొందరు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. మండలి ఉప సంఘాల నియామకం కూడా పూర్తి చేసే అవకాశాలున్నాయి. దేవస్థానంలో ఉప సంఘాల పాత్ర కీలకంగా ఉంటుంది. 2018-19 బడ్జెట్పై మండలి సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మండలి నియామకానికి ముందే ప్రతిపాదనలు తయారు చేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం, ఆమోదం పొందడంలాంటి పరిణామాలు జరిగిపోయాయి. బడ్జెట్కు మండలి ఆమోదముద్ర కోసం అజెండాలో చేర్చారు. సవరణలు చేపట్టడానికి నిబంధనలు పరిశీలించాలని కొందరు సభ్యులు పట్టుబడుతున్నారు. సవరణలో కూడిన బడ్జెట్ను తయారు చేయాలని భావిస్తున్నారు. ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందన్నది తేలనుంది.