న్యాయం జరుగుతుంది, అనుమతిస్తే యాత్ర: బహిష్కరణపై పరిపూర్ణానందస్వామి
కాకినాడ: హైదరాబాద్ నుంచి బహిష్కరణ వ్యవహారంలో కోర్టు తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి అన్నారు. తీర్పు తర్వాత తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే పాదయాత్ర కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పరిపూర్ణానంద స్వామి ఆదివారం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో గోసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పాత ప్రసంగం! పరిపూర్ణానందస్వామి నగర బహిష్కరణ: 'ఇదో బ్లాక్ డే'
హిందూ ధర్మ ప్రచారం ప్రతి పౌరుడు తన హక్కులా భావించాలని స్వామి అంతకుముందు రోజు (శనివారం) అన్నా రు. ఆయనకు రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. అనంతరం ఉభయ దేవాలయాల్లో మంగళ హరతి ఇచ్చారు.
ఆలయం వెలుపల పరిపూర్ణానంద మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని ఆలపించడంతో పాటు భారతీయ సంస్కృతి చాటిచెప్పే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని అభాసుపాలు చేసేందుకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే కోర్టు అనుమతితో యాదాద్రి దర్శనానికి భక్త బృందంతో వెళ్తానని చెప్పారు.