నేను యూపీ నుంచే కానీ.. ఏపీ కోసమే మాట్లాడుతున్నా: ఎంపీ జీవీఎల్
విజయవాడ: తాను రాజ్యసభకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నానని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అదే మా లక్ష్యం..
ఎన్నో జాతీయ సంస్థలు రాష్ట్రానికి వచ్చినప్పటికీ.. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాకు రాలేదన్నారు. ఆ ప్రాంతాలకు కూడా సంస్థలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. రాయలసీమకు కేంద్రం నుంచి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలో ప్రయత్నిస్తున్నామని జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు.
కేవలం రాజకీయాలు సరిపోవు..
త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వం పట్ల దేశ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశమే ముందుందని జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏ పార్టీ అయినా కేవలం రాజకీయాలు చేస్తే మనుగడ సాగించడం కష్టమని అన్నారు. ఇప్పుడు పాతతరం రాజకీయాలు పనికిరావని.. పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని జీవీఎల్ నర్సింహారావు అన్నారు.
బీజేపీని ఎవరూ ఆపలేరు..
తమ పార్టీలోకి నేతలు రాకపోయినా.. బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. పొత్తులు పెట్టుకుని తాము ఇతర పార్టీలను కాపాడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే కాలంలో ఏపీలో భారతీయ జనతా పార్టీదే భవిష్యత్ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఏపీలో ఆ పార్టీతోపాటు అధికారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. అయితే, 2019లో మాత్రం టీడీపీ, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీకి ఒక్కసీటు రాకపోగా, టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో మరోసారి పొత్తు పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం.