తొలి కార్మికుడ్ని నేనే, నాకే మీరంతా సన్మానం చేయాలి: చంద్రబాబు
అహర్నిశలు కష్టపడే తొలి కార్మికుడిని తానే అని, ఏదైనా సన్మానం చేయాలంటే తొలుత తనకే చేయాలని చంద్రబాబు అన్నారు.
విజయవాడ: "ఏదన్నా సన్మానం చేయాలంటే మీరందరూ నాకే చేయాలి. ఎందుకంటే రాత్రి, పగలు పనిచేస్తున్నాను. నిద్రపోయే సమయం తప్పా మిగిలిన సమయమంతా ప్రజలకోసం పనిచేస్తున్నాను" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
"నాకెప్పుడూ అలుపులేదు. ఎందుకు అలుపులేదంటే ఇష్టపడి పనిచేస్తున్నాను. మీరు కూడా ఇష్టపడి పనిచేస్తే మీకూ అలుపు ఉండదు, విసుగు ఉండదు.బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థతి ఉంటుంది" అని ఆయన అన్నారు. మేడే వేడుకల్లో ఆయన సోమవారం మాట్లాడారు.
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచమంతా జరుపుకొనే పండుగ మే డే అని ఆయన అన్నారు. కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. యజమానులు, కార్మికులు కుటుంబసభ్యుల్లా ఉండాలని, కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత యాజమాన్యానిదేనని ఆయన స్పష్టం చేశారు.
అసంఘటిత కార్మికులు...
రాష్ట్రంలోని కార్మికుల్లో 80 శాతం మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని, వారు అభద్రతా భావంలో ఉన్నారని, వారికి బీమా సౌకర్యం కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మొత్తం 2.13కోట్ల మందికి చంద్రన్న బీమా కల్పించామని చంద్రబాబు తెలిపారు.
సాంకేతికతే కారణం...
అన్నిరంగాల్లో మార్పులకు సాంకేతికత కారణంగా నిలుస్తోందని, సాంతికేతికతను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, కమ్యూనిస్టు దేశం చైనా సాంకేతికతలో దూసుకెళ్తోందని చంద్రబాబు అన్నారు. కార్మికులు చట్టానికి వ్యతిరేకంగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పోరాడితే ఫలితాలు సాధించలేరని అభిప్రాయపడ్డారు. జపాన్లో కార్మికులు సంస్థలపై అసంతృప్తి ఉంటే క్రమశిక్షణగా నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని ఆయన చెప్పారు.
ప్రత్యేక చట్టాలు తెస్తాం..
కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమని చ ద్రబాబు తెలిపారు. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రతి ఒక్క కార్మికుడికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అసలు సిసలు కార్మికుడ్ని నేనే..
రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే తొలి కార్మికుడిని తానేనని చంద్రబాబు అన్నారు. ప్రజలకు, కార్మికులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం అనుక్షణం పనిచేస్తోందని చెప్పారు. సాంకేతిక సాయంతో పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు.