రాజీనామా ఉపసంహరించుకుంటున్నా.. ప్రాణమున్నంత వరకు టీడీపీలోనే : బొజ్జల
ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను తాను ఉపసంహరించుకుంటున్నానని, ప్రాణమున్నంత వరకు తేదేపాలోనే కొనసాగుతానని టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
చిత్తూరు: ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనను క్యాబినెట్ నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ రోజు మీడియాకు పలు విషయాలు చెప్పారు.
క్యాబినెట్ విస్తరణ అనంతరం ఆనారోగ్యం కారణంగా తనను మంత్రి పదవి నుంచి తొలగించారనే ప్రచారం జరిగిందని, దీనికి మనస్థాపం చెంది తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు.
అయితే, తాను ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశానుకానీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదని బొజ్జల వ్యాఖ్యానించారు. తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.
తాను ప్రాణమున్నంత వరకు తేదేపాలోనే కొనసాగుతానని గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి రాజీనామాలు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు.