పవన్ని నేను నమ్ముతున్నా, బ్లాంక్ చెక్ ఇస్తా, దీక్షలో కూర్చోవద్దు.. చంపేస్తారు: పోసాని సంచలనం
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుగా నిలిచారు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తాను నమ్ముతున్నానని, ఆయన చేసిన ఆరోపణల్లో నిజం కచ్చితంగా ఉండి తీరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Recommended Video
బుధవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడిన పోసాని పవన్పై ఉన్న ప్యాకేజీల స్టార్ అనే ఆరోపణలపై స్పందిస్తూ.. పవన్ డబ్బుకు లొంగే రకం కాదన్నారు. ఆయన డబ్బులు తీసుకున్నాడని అంటే తాను నమ్మనని అన్నారు. పదికి రూపాయికి అమ్ముడుపోయే నటుడు పవన్ కాదంటూ పోసాని కుండ బద్ధలు కొట్టారు.
ఎన్నో లాభాలు.. అన్నీ పక్కన పెట్టారంటే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసుంటే పవన్కు ఏ పనైనా జరుగుతుందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఇంట్లో కూర్చొని పవన్ ఫోన్ చేస్తే అన్నీ అయిపోతాయని తెలిపారు. ఆయనకు చాలా లాభాలు ఉంటాయన్నారు. అవన్నీ పక్కన పెట్టి.. పెద్ద సభలో చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశాడంటే.. వాటిల్లో కచ్చితంగా నిజం ఉండి ఉంటుందన్నారు.
పవన్ని నేను నమ్ముతున్నా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తాను నమ్ముతున్నానని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. ఏ అవినీతి లేకపోతే పవన్ను పిలిచి ప్రూఫ్లు చూపించమని అడగాలంటూ టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. పవన్ రెండు ఎకరాల్లో ఇల్లు కట్టుకోవడం కాదు.. వంద ఎకరాల్లో కూడా కట్టుకోవచ్చు అన్నారు. ఆయన డబ్బు సంపాదించుకోవాలంటే ఏ రకంగానైనా సంపాదించుకోవచ్చని పోసాని వ్యాఖ్యానించారు.
డబ్బే కావాలంటే.. ఎన్ని కోట్లైనా నేనిస్తా...
పవన్ కళ్యాణ్కి డబ్బే కావాలంటే ఎన్నికోట్లు అయినా తాను ఇస్తానని పోసాని చెప్పారు. సినీరంగంలో పవన్ కళ్యాణ్ డిమాండ్ ఉన్న హీరో అని, తను మళ్లీ సినిమాలు చేస్తా అంటే బ్లాంక్ చెక్ ఇస్తానని, దానిపై ఎన్ని సున్నాలు పెట్టుకున్నా పర్వేలేదని వ్యాఖ్యానించారు. 30, 40 కోట్లు ఇవ్వడానికైనా రెడీ అన్నారు. కేవలం టాలీవుడ్లోనే కాదని.. దేశంలోనే అంత డిమాండ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని పోసాని అన్నారు.
"ఐలవ్యూ నాన్నా... దీక్షకు నువ్వు కూర్చోవద్దు"
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ చేస్తానన్న ఆమరణ దీక్షకు తాను మద్దతు ఇస్తానని సినీ నటుడు పోసాని తెలిపారు. అయితే ఆయన దీక్షకు కూర్చోవాలని కోరుకోవడం లేదన్నారు. అసలు ఆయన ఎందుకు కూర్చోవాలని ప్రశ్నించారు. దోచుకున్నవాళ్లు ఎందుకు కూర్చోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష పేరుతో ఆయన్ను చంపడానికి ప్లాన్ చేశారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ ఎమ్మెల్యే అయ్యాడా.. మంత్రి అయ్యాడా.. సీఎం అయ్యాడా... ఆయన్ను ప్రోత్సహించి.. దీక్షకు కూర్చోబెట్టి చంపినా చంపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. "ఐలవ్యూ నాన్నా... నువ్వు కూర్చోవద్దు" అంటూ వేడుకున్నారు.
అలా చేస్తే 30 రోజుల్లో ప్రత్యేక హోదా...
ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి సినీ నటుడు పోసాని కృష్ణమురళి సూపర్ ఐడియా ఇచ్చారు. ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విజయవాడలో ఆమరణదీక్ష చేస్తే... 30 రోజుల్లో ప్రత్యేక హోదా వస్తుందని తేల్చి చెప్పారు. వాళ్లకు మద్దతుగా సినిమా వాళ్ల తరఫున తానూ వస్తానన్నారు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే తాను చెప్పింది చేయాలని సవాల్ విసిరారు. అలా చేశాక కూడా రాకపోతే తనను కొట్టి చంపాలని పోసాని అన్నారు.