ఫోన్ చేసి జగన్ ఉచ్చులో పడొద్దని చెప్పా, ఏపీకి ఇదే నా హామీ, యూటర్న్: బాబును దులిపేసిన మోడీ
Recommended Video
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్యాకేజీకి అంగీకరించి ప్రశంసించిన ఆయన వైసీపీ ఉచ్చులో పడి, తన స్వార్థ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆ రోజు తాను తల్లిని చంపి బిడ్డను కాపాడారని అన్నానని, ఇప్పుడు తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని చెబుతున్నానని అన్నారు.
టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఘోరంగా వీగిపోయింది. మోడీకి మద్దతుగా 325 ఓట్లు (అవిశ్వాసానికి వ్యతిరేకంగా), అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. పన్నెండు గంటల పాటు అవిశ్వాసంపై చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంలో ఓటమికి ముందు మోడీ గంటకు పైగా మాట్లాడారు.
వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు లేవన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్గడ్ రాష్ట్రాలు వాజపేయి హయాంలో ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కానీ ఎలాంటి గొడవలు రాలేదన్నారు. మీరు (కాంగ్రెస్) భారత్, పాకిస్తాన్ను విడగొట్టినప్పటి గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయని కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణను కూడా అలాగే విభజించారన్నారు.
తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు బాబు యూటర్న్
ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే బెట్టర్ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. 2016 సెప్టెంబర్లో తాము ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే చంద్రబాబు స్వాగతించారని తెలిపారు. 4 నవంబర్ 2016న చంద్రబాబే స్వయంగా ఆర్థికమంత్రి జైట్లీని ప్రశంసించారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకుందని దుయ్యబట్టారు. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తాము తప్పకుండా గౌరవిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ వేచి చూసింది
తెలంగాణ ముందడుగులో ఉందని, ఏపీలో ఏం జరుగుతుందో మీకు తెలుసునని సభ్యులను ఉద్దేశించి మోడీ అన్నారు. వాజపేయి హయాంలో విభజించబడిన మూడు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. విభజన హామీల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెరాస సంయమనంతో వేచి చూసిందని కితాబిచ్చారు.
14వ సంఘం మమ్మల్ని కట్టడి చేసింది
సాధారణ, ప్రత్యేక రాష్ట్రాలను పక్కన పెట్టాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. సభ అదుపులో లేకున్నాతలుపులు మూసి బిల్లును ఆమోదించారని తాను చెప్పానని అన్నారు. ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందన్నారు. తెలుగు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఏపీకి హోదా ఇవ్వాలనుకున్న 14వ ఆర్థిక సంఘం కట్టడి చేసిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాల ప్రాతిపదికన చూడాలని చెప్పిందన్నారు.
బాబుకు ఫోన్ చేసి వైసీపీలో ఉచ్చులో చిక్కుకున్నావని చెప్పా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకోవద్దని చంద్రబాబుకు చెప్పామని మోడీ అన్నారు. తాను చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి.. చంద్రబాబూ.. నువ్వు వైసీపీ ఉచ్చులో చిక్కుకున్నావ్.. అని చెప్పానని తెలిపారు. మీ గొడవలో నన్ను వాడుకోవద్దని కూడా చెప్పానని అన్నారు. కానీ ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.
ఏపీ ప్రజలకు ఇదే నా హామీ
వైయస్సార్ కాంగ్రెస్, టీడీపీలు పోటీపడి సభను వాడుకుంటున్నారని మోడీ మండిపడ్డారు. ఏపీ ప్రజలకు నేను భరోసా ఇస్తున్నానని, కేంద్రం ప్రజల అభివృద్ధిని కోరుకుంటోందని చెప్పారు. ఆంధ్రా అభివృద్ధి దేశం అభివృద్ధి అన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం విషయంలో కేంద్రం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మిత్రపక్షాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
రాజధాని, రైతుల విషయంలో వెనుకడుగు లేదు
నవ్యాంధ్ర రాజధాని, రైతులకు సంబంధించిన విషయాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయదని మోడీ చెప్పారు. తెలుగు మన తల్లి అన్నారు. కాగా, ప్రధాని మోడీ మాట్లాడుతున్నంతసేపు టీడీపీ ఎంపీలు మాత్రం తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే మోడీ తన ప్రసంగం పూర్తి చేశారు.
మోడీ ప్రపంచంలోనే గొప్ప నటుడు
ప్రధాని మోడీ మాట్లాడిన అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. ఆయన రైట్ టు రిప్లై కింద మాట్లాడారు. మోడీ ప్రపంచంలోనే గొప్ప నటుడు అన్నారు. ప్రధాని మోడీ గొప్ప నటన, నాటకీయత, హావభావాలతో ప్రసంగించారన్నారు. 2014కు ముందు కూడా ఇలాగే నటించారన్నారు. దాదాపు గంటన్నరసేపు సమ్మోహనరీతిలో ఆయన ప్రసంగించారన్నారు. ప్రధాని అవాస్తవ గణాంకాలు, వివరణలు చెప్పారన్నారు. ప్రధాని ప్రసంగం బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రాన్ని తలపించిందన్నారు. ప్రధాని ప్రసంగంలో ఏపీ హామీలను నెరవేర్చే అంశం ఏదీ లేదన్నారు.