మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా...మెడికో గీతిక మరో రెండు సూసైడ్ నోట్స్ లభ్యం
తిరుపతి:ఎస్వీ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని గీతిక ఆత్మహత్య దర్యాప్తు కేసు క్రమంలో పోలీసులకు ఆమెకు సంబంధించిన మరో రెండు సూసైడ్ నోట్స్ లభ్యమయ్యాయి.
Recommended Video
తద్వారా ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని దాదాపుగా నిర్థారణ అయింది. అయితే గీతిక ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని గీతిక కుటుంబ సభ్యులు స్పష్టం చేసినా...పోలీసులు మాత్రం తమ ప్రాథమిక అంచనా ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితులకు అవసరం లేకపోయినా తమ బాధ్యత ప్రకారం పూర్తి వాస్తవాలు నిర్ధారించుకునేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
గీతిక...ఆత్మహత్య పూర్వాపరాలు
ఎస్వీ వైద్య కళాశాలలో సెకండియర్ చదువుతున్న కడపకు చెందిన పుట్లూరు గీతిక, తన తల్లి హరితాదేవితో తిరుపతిలోనే ఒక అపార్టమెంట్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఈమె ఇంట్లోనే ఉరేసుకుకొని చనిపోవడం సంచలనం సృష్టించింది. అయితే గీతక సూసైడ్ గురించి ఆదివారం సాయంత్రానికే తెలిసినా రాత్రి పొద్దుపోయే వరకు ఈ విషయమై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కడప జిల్లా నుంచి తమ బంధువులు వచ్చాక ఫిర్యాదు చేస్తామని ఆమె పోలీసులకు తెలిపారు. కేవలం ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని, మరే కారణాలు లేవని ఆమె పోలీసులు, మీడియాతో చెప్పారు.
పరీక్షల ఒత్తిడే...ఫిర్యాదులోనూ అలాగే!
గీతికకు సోమవారం పరీక్ష ఉన్నందున ఒత్తిడికి గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె చెప్పారు. కుమార్తె ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఆమె అలిపిరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కూడా అవసరం లేదని గీతిక తల్లి, బంధువులు పోలీసులను అభ్యర్థించినట్లు తెలిసింది. అయితే అంతకుముందే ఎస్వీ కాలేజ్ ప్రొఫెసర్లతో వివాదం నేపథ్యంలో శిల్పి అనే పిజి వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో గీతిక సూసైడ్ పెను ప్రకంపనలకు దారి తీయడంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో గీతిక ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించగా తొలుత ఒక సూసైడ్ నోట్ లభించగా తాజాగా మరో రెండు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ సూసైడ్ నోట్లలో...ఏముందంటే?
ఒక లేఖలో...‘డియర్ మామ, అమ్మా నా లైఫ్లో అన్ని పరిస్థితుల్లో నన్ను వదలకుండా నాతో ఉన్నది మీరు మాత్రమే. నాకు బతికే అర్హత లేదు. నేను ఎన్నో చేశాను. అసలు చెప్పాలంటే ఏ అమ్మాయి నాలా ఉండదు. నేను ఇవ్వాల చచ్చిపోతే నేను చేసిన ఒక్కటి కూడా ఉండదు. ఫ్యూచర్ని మైండ్ సెట్తో ఎంతో చేసినా నాకు భయం వేసింది. అందుకే ఇలా చేశా. నాకు తప్పు చేయాలని లేదు. కానీ నా మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇవ్వాల నేను చేసిన దానికి ఎవరూ బాధ్యులు కారు. నేనే అన్ని చేసుకున్నా. ఐయామ్ సో సారీ టు ఆల్ ఆఫ్ యూ.. గుడ్ బై' అని ఉంది.
మరో లేఖలో...ఇలా ఉంది
‘డియర్ సుధీర్, ఇందు.. మీరిద్దరూ నన్ను నిజంగా ప్రేమించారు. నా వల్ల ఎన్నో కోల్పోయారు. తప్పులు చేసినా చాన్స్ ఇచ్చారు, కానీ, నేను నిలబెట్టుకోలేకపోయాను. నిన్ను ఇంకోటి చాన్స్ అడిగే అర్హత కూడా లేదు. నా వల్ల కోల్పోయినా, నేను తిరిగి ఇచ్చే పరిస్థితిలో లేను. అయామ్ సో.. సారీ. కుదిరితే క్షమించండి. నా సూసైడ్కి రీజన్ నేను, నామైండ్ సెట్. ఎవరు కూడా దీన్ని ఇష్యూ చెయ్యకండి ప్లీజ్..' అంటూ ముగించింది.
ప్రేమవ్యవహారమని...నిర్థారణ
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు గీతిక చివరిసారిగా రాసిన మూడు సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలను బట్టి ప్రేమ అంశానికి సంబంధించిన కారణంగానే గీతిక సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. దీనిపై వారు గీతిక తల్లి హరితాదేవిని ప్రశ్నించగా ఆమె కూడా ప్రేమ విషయాలు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. సూసైడ్నోట్లో గీతిక ప్రస్తావించిన వ్యక్తుల గురించి అడగ్గా...వారెవరో తనకు తెలియదని ఆమె చెప్పారని సమాచారం. అయితే గీతిక మరణానికి మరెవరైనా కారణమా అనే కోణంలో విచారణ కోసం పోలీసులు ఆమె కాల్డేటా విశ్లేషణతోపాటు ఇతర వివరాలను సేకరిస్తున్నారు.