‘‘2019 ఎన్నికల్లో బాలకృష్ణపై గెలవకపోతే అరగుండుతో ఊరేగుతా..’’
హిందూపురం శాసనసభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై గెలవకపోతే అరగుండుతో ఊరేగుతానని వైసీపీ ఇన్చార్జి నవీన్ నిశ్చల్ సవాల్ చేశారు.
అనంతపురం: హిందూపురం శాసనసభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై గెలవకపోతే అరగుండుతో ఊరేగుతానని వైసీపీ ఇన్చార్జి నవీన్ నిశ్చల్ సవాల్ చేశారు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పలు విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బాలకృష్ణ విస్మరించారని, 2019లో బాలకృష్ణను ప్రజలు నమ్మబోరని నవీన్ అన్నారు.
2009 ఎన్నికల్లోనే తాను ఎమ్మెల్యేను కావాల్సిందని, కానీ.. రఘువీరారెడ్డి వల్లే వైఎస్ రాజశేఖర్రెడ్డి తనకు టికెట్ కేటాయించలేదని నవీన్ చెప్పారు. భగవంతుడు తనకు ధనం ఇవ్వకపోయినా, ప్రజా బలం ఇచ్చాడని నవీన్ నిశ్చల్ అన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున తనకు టికెట్టు వస్తే తప్పకుండా విజయం సాధిస్తానని నవీన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను కచ్చితంగా సాగనంపుతానని, అలా జరగని పక్షంలో తానే అరగుండు గీయించుకుని హిందూపురం నడి బజారులో ఊరేగుతానని నవీన్ నిశ్చల్ సవాల్ చేశారు.