అలాంటి అమెరికా వచ్చి డబ్బు అడుగుతానా, అసహ్యంగా ఉంటుంది: పవన్ కళ్యాణ్
డల్లాస్: అందరు ఎన్నారైల వద్ద డబ్బు ఉంటుందనే మాట వింటుంటే వినడానికే అసహ్యం వేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. డల్లాస్లో ఎన్నారైలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నారైలు ఏమైనా నడిచే డాలర్లా అని ప్రశ్నించారు. వారు నిండు మనసున్న మనుషులు అని, వారిని డబ్బులా చూడకూడదని చెప్పారు.
బాబు క్షమాపణ కోసం ఏపీ బీజేపీ డిమాండ్: నిన్నటి దాకా జగన్-పవన్ కళ్యాణ్లనూ లాగిన టీడీపీ!
చిన్నప్పటి నుంచి స్కూల్లో పాఠాల్లో ఉన్నతమైన విలువలు నేర్పిస్తారని, కానీ రాజకీయ నాయకులు విలువలు పాటించరని, అంటే అలాంటి వారు చెప్తే మేం పాటించాలా అన్నారు. పెరిగి పెద్దయ్యాక అయినా బాగుంటుంది అనుకుంటే అర్బన్ ప్లానింగ్, అవినీతి పెరిగిపోయి రౌడీలు రాజ్యమేలే స్థాయికి వచ్చినప్పుడు మరి అంబేద్కర్, మహాత్మ గాంధీ లాంటి వారి త్యాగాలకు విలువెక్కడ ఉందన్నారు.
మోడీ పార్లమెంటు మెట్లకు మొక్కడం చూశా
మన జీవితాలను రౌడీలు నిర్ణయించడం ఏమిటని పవన్ ప్రశ్నించారు. ఆడపడుచులకు బయటకు వెళ్తే రక్షణ లేదన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న కోపం, సినిమాల్లో వీటిపై మాట్లాడితే తృప్తి ఉంటుందేమో అనుకుంటే లేదని చెప్పారు. నేను పార్లమెంటులోకి ఒక అతిథిగానో, ఎంపీగానో అడుగు పెట్టలేదని, ఒక పార్టీ నాయకుడిగా అడుగు పెట్టానని, మోడీ పార్లమెంటు మెట్లకు దండం పెట్టి వెళ్ళటం నేను చూశానని, ఆరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న ఒక్కొక్కరికి చూస్తుంటే డబ్బులతో ఓట్లు కొనేసిన వారు, దౌర్జన్యంతో వెళ్లిన వారు, కొంతమంది నిజాయితీ నాయకులతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు.
అందరిలా చేతులు కట్టుకొని కూర్చోను
ఒక్కప్పుడు పార్లమెంటులో జ్ఞానులు, చట్టాలు రాయగలిగినవారు, త్యాగాలు చేయగలిగిన వారు ఉండేవారని, ప్రజల కోసం అన్ని వదులుకునేవారని, ఇప్పుడు అలా లేదన్నారు. తన జీవిత కాలంలో గొప్ప మార్పులు జరుగుతాయని రాజకీయాల్లోకి రాలేదని, కానీ అందరిలాగా చేతులు కట్టుకొని కూర్చొనని, సినిమాలు చేసి డబ్బులు సంపాదించి, ఇంట్లో పిల్లల్ని చూస్తూ, వృద్ధాప్యం వచ్చి చచ్చిపోవాలని తనకు లేదన్నారు. నేను అన్ని వదిలేసి బలమైన పోరాటం చేయగలనా లేదా అని ఆలోచించాకే జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. దేశం కోసం తన 25 ఏళ్ల పూర్తి జీవితాన్ని అంకితం చేస్తున్నానని, ఎక్కువకాలం ఉంటానో లేదో అది దైవ నిర్ణయం అన్నారు.
నేను డబ్బులు ఎలా అడుగుతా.. చాలా అసహ్యంగా ఉంటుంది
తాను అమెరికా వచ్చింది పార్టీ ఫండ్ కోసం కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ఆత్మగౌరవంతో బ్రతికేవాడినని చెప్పారు. కోట్లు ఇచ్చిన వాడిని, డబ్బును వదులుకొని వచ్చిన వాడినని, అలాంటి నేను డబ్బులు ఎలా అడుగుతానని, చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పారు. నేను డబ్బులు వదులుకున్న వాడినని, ఇచ్చేసిన వాడిని, ఈ రోజుకి నేను సినిమా చేస్తా అంటే ఎవరూ ఊహించనంత డబ్బులు ఇస్తారని చెప్పారు.
ప్లాపులు వచ్చే కొద్ది నా మార్కెట్ పెరిగింది
తన సినిమాలు ఆడినప్పుడు డబ్బులు రాలేదని, ప్లాప్ అయినప్పుడు ఎక్కువగా వచ్చేవని పవన్ చెప్పారు. అదేంటో కానీ తనకు ప్లాపులు వచ్చే కొద్ది మార్కెట్ పెరిగిందని, అదేంటో అర్థమయ్యేది కాదని చెప్పారు. తాను అమెరికాకు డబ్బులు అడగటానికి రాలేదని, మీ కోసం వచ్చానని, ఒక మారుమూల ఉద్ధానం, అనంతపురం, అరకు, నెల్లూరుకు ఎలా వెళ్లానో, తెలంగాణలోని మారుమూల గిరిజన తండాల్లోకి ఎలా తిరిగానో అలానే డల్లాస్ వచ్చానని చెప్పారు. సముద్రాలు దాటినా, ఖండాలు దాటినా, మీకు తనకు మధ్య రెండు గుండేలే దూరమన్నారు.
భద్రత కల్పించకపోవడం ఓ ట్రాజెడీ
చాలామంది డబ్బు దేనికి ఉంటారని, పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇవ్వాలంటే ఒక్కడే వస్తాడా, 400 మంది కదలాలి, వెంట 40 కార్లు రావాలని, ఎందుకంటే గవర్నమెంట్ పోలీసులను ఇవ్వదని చెప్పారు. అమెరికా ప్రభుత్వం పోలీసులను ఇచ్చిందని, సొంత రాష్ట్రం మనకు ఇవ్వదన్నారు. భద్రత కల్పించకపోవడం ఒక ట్రాజెడీ అన్నారు. వ్యవస్థలను ఎంతలా చంపేశారో చెప్పేందుకు ఉదాహరణ అన్నారు.
బయటి దేశం వారు మన దేశాన్ని దోచుకెళ్లారు
బయట దేశానికి వచ్చాక మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కించపరచడం తనకు ఇష్టం లేదని, అది మన ఇంటి సమస్య, అక్కడ ఎవరిని ఏం అనాలో అక్కడ తేల్చుకుందామని పవన్ చెప్పారు. భారత దేశానికి, అమెరికాకు ఎంత దగ్గర సంబంధముంటే కొలంబస్ భారతదేశాన్ని కనిపెడదామనుకొని అమెరికాను కనుగొన్నాడని అన్నారు. మనం ఎప్పుడు ఎవరి మీద దాడి చేయలేదని, అది భారత దేశం గొప్పతనం అన్నారు. ఎవరి ఆస్తులను అనవసరంగా తీసుకోలేదన్నారు. ఎంతో స్వయంప్రతిపత్తి ఉన్న దేశమని చెప్పారు. ఎంతో సంపత్తి ఉన్న మన దేశన్ని అందరూ కొనుగొనాలనుకున్నారని, వచ్చి దోచుకెళ్లారని చెప్పారు. మన దేశం మాత్రం ఎవరినీ దోచుకోలేదన్నారు. తనపై మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహం లింకన్ వంటి వారు ప్రభావం చూపించారని చెప్పారు. ఇలాంటి చోట మాట్లాడటం ఆనందమన్నారు.