కాంగ్రెస్ను వీడలేదు, టిడిపిలో చేరలేదు: డిఎల్
కడప: కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తాజాగా స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీలోనూ చేరలేదని స్పష్టం చేశారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రవీంద్రా రెడ్డి పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎన్నికల తర్వాత అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని, ప్రస్తుతం అలాంటి రాజకీయాలు కనిపంచడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే రాజకీయాలకు ఐదేళ్ల విరామం ప్రకటించుకున్నానని చెప్పారు.
మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కోరినప్పుడు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తానని డిఎల్ తెలిపారు. అనంతరం బ్రహ్మంసాగర్ను రవీంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సిఎం వైయస్ హయాంలోనే బ్రహ్మంసాగర్ నీటితో కళకళలాడిందని అన్నారు.
2007లో 12టిఎంసిల నీటిని బ్రహ్మంసాగర్లో నిల్వ చేసిన ఘనత వైయస్కే దక్కిందన్నారు. 2013లో బ్రహ్మంసాగర్కు నీరు తెప్పించాలని అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డిని కోరినా ఆయన స్పందించలేదని తెలిపారు. ప్రస్తుతం బ్రహ్మంసాగర్కు నీరు వస్తుందా లేదా అనేది సందేహంగా ఉందన్నారు.