ఆమె నాకు చెల్లెలి కన్నా ఎక్కువ...ఎందుకు అవమానిస్తా!: టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
నెల్లూరు:మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారదను అవమానించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి టిడిపి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దిద్దుబాటు చర్యలు ఆరంభించారు.
మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద తనకు చెల్లెలు కన్నా ఎక్కువని, ఆమెను ఎందుకు అవమానిస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ విషయమై తనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా చెప్పుకొచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ చేనేత దినం రోజున మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో చైర్పర్సన్ కుర్చీ తీసి వేయించానని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద తనకు చెల్లెలు కన్నా ఎక్కువని...ఆమెని రాజకీయాల్లోకి తానే తీసుకు వచ్చానని అలాంటిది ఆమెను ఎందుకు అవమానిస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ కార్యక్రమాలన్నీ చైర్పర్సన్ దొంతు శారద చేతుల మీదుగానే జరుగుతున్నాయని చెప్పారు. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవారమని, తామంటే గిట్టని వారు తమ మధ్య విభేదాలు సృష్టించేందుకే ఇటువంటి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కు వివాదాలు కొత్తకాదని ఆయన ప్రత్యర్థులు చెబుతున్నారు. 2014లో జడ్పీ ఛైర్మెన్ ఎన్నిక సందర్భంగా జడ్పీ హాల్లో అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్పై ఆయన చేసిన వీరంగం మీడియాలో హల్ చల్ సృష్టించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇటీవలే తెలుగుదేశం కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలంటూ అధికారులను ఆయన బూతులు తిడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెబుతున్నారు. అధికారులను, ప్రతిపక్షాలు, ప్రత్యర్థులనే కాదు సొంత పార్టీ వాళ్ళను కూడా ఆయన తిడుతుంటారని వారు ఎద్దేవా చేస్తున్నారు.
తాజాగా దొంతు శారద వివాదం విషయానికొస్తే...మున్సిపల్, కార్పొరేషన్ సమావేశాలలో ఛైర్పర్సన్లు, మేయర్లు మాత్రమే అధ్యక్షస్థానంలో వుంటారు. ఆ పరిధిలో సభ్యులు కింద తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటారు. ఎక్స్అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల సమావేశాలకు హాజరైనా సాధారణ సభ్యుల పక్కనే కూర్చోవాలి. అధ్యక్ష స్థానంలో వున్న ఛైర్పర్సన్కు తప్పక గౌరవం ఇవ్వాలి.
Recommended Video
అయితే ఈ నెల 7వ తేదీన జరిగిన వెంకటగిరి మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణ ఛైర్పర్సన్కు ప్రత్యేకంగా వేసివున్న కుర్చీని కమిషనర్తో చెప్పి పక్కన పెట్టించారని...ఛైర్పర్సన్కు ఒక ప్లాస్టిక్ కుర్చీ వేయించి...ఆ కుర్చీ పక్కనే తనకూ ఒక కుర్చీ వేయించుకొని సమావేశాన్ని జరిపించారనేది ఆరోపణ. ఎమ్మెల్యే కు భయపడి ఛైర్పర్సన్ హోదాకు గౌరవాన్ని కాపాడాల్సిన కమిషనర్, ఈ విషయంలో మౌనం వహించడంతో...ఈ చర్యలతో అవమానంగా ఫీలైన ఛైర్పర్సన్ దొంతు శారద కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.