నేను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదు...రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్దమే: వసంత నాగేశ్వరరావు
విజయవాడ: తాను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని...అసలు నందిగామలో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది దేవినేని కుటుంబమేనని ఆయన ఆరోపించారు.
మంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసు
గుంటుపల్లి ఈవో నరసింహారావును వసంత నాగేశ్వరరావు బెదిరిస్తున్న ధోరణిలో ఉన్న ఆడియో వైరల్ కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టేపుల్లో మంత్రి దేవినేని ఉమను హత్య చేస్తామనే రీతిలో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో వసంత నాగేశ్వరరావు ఫోన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా...ఈ వివాదంపై వసంత నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు.
అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రాగా దీనిపై సీరియస్గా స్పందించిన సీఎం చంద్రబాబు ఇలాంటి బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని...ఇలాంటి చర్యలను ఎంతటివారు ప్రోత్సహించినా తీవ్రస్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంలో వసంత నాగేశ్వరరావుపై ఇప్పటికే కేసు నమోదైందని టిడిపి నేతలు సిఎం దృష్టికి తీసుకెళ్లారు.
అంతకుముందు గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు విషయమై ఈ నెల 7న సాయంత్రం తనకు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఫోన్ చేసి టిడిపి ఏజెంటుగా పనిచేస్తున్నావంటూ బెదిరించారని గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి దేవినేని ఉమాను ఏమైనా చేస్తామని, అవసరమైతే కడప నుంచి మనుషులను తెప్పిస్తామని మాట్లాడారని కార్యదర్శి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆరా తీశారని.. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆడియో టేప్ను విని కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తాను ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. నందిగామలో హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది దేవినేని కుటుంబమేనని ఆరోపించారు. గుంటుపల్లి ఈవో నరసింహారావుతో తనకు చనువు ఉందని, ఫ్లెక్సీల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈవో దృష్టికి తీసుకెళ్లానని వసంత నాగేశ్వరరావు తెలిపారు. ఈవోను భయపెట్టినట్లు ఋజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధమేనంటూ తాను సాధారణంగానే మాట్లాడానని వసంత నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.