ఎవరికీ ఓటు వేయమని నేను చెప్పలేదు...వారికి మాత్రం వెయ్యొద్దు:సిఎం చంద్రబాబు
కర్నూలు: కర్ణాటక ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయమని నేను చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే మనకు అన్యాయం చేసిన వారికి మాత్రం ఓటు వెయ్యొద్దని చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎపిలో బీజేపీ అవినీతి కేసుల పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని, లేదంటే ఎన్నికల తరువాత అయినా కలుపుకోవాలని చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కేంద్రంతో పోరాడుతుంటే వైసీపీ నాపై పోరాడుతోందని, బీజేపీతో లాలూచీ పడుతున్న వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
కర్నూలు పర్యటన సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని చెప్పారు. అలాగే ఓర్వకల్లుకు పరిశ్రమలు భారీగా తరలి వస్తున్నాయన్నారు. ఇక్కడి విద్యావంతులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాంతంలో రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, తద్వారా 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. అలాగే సెప్టెంబర్ నెలలోనే ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు ప్రారంభంకానుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఎపికి ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేస్తున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చంద్రబాబు హయాంలో రాయలసీమలో అభివృద్ది పరుగులు పెడుతోందన్నారు. ముఖ్యంగా మహిళలు చంద్రబాబుకు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కొంతమంది ప్రత్యేక హోదా పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.